ఆధార్ బయోమెట్రిక్ డేటా తారుమారు

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో యూపీ ముఠా నిర్వాకం
  • ఆధార్ కార్డుల్లోని పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్లు మార్పు
  • అలా చేసినందుకు ఒక్కో కార్డుదారుల నుంచి రూ. 5 వేల వరకు వసూలు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఏజెంట్ల నియామకం

సహనం వందే, మీరట్:
దేశంలోని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటైన ఆధార్ భద్రతకు పెద్ద గండి పడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా ఏకంగా 12 రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజల ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని మార్చేసిందని బయటపడటంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన ఆధార్ వ్యవస్థపై నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. మన వ్యక్తిగత సమాచారం ఇంత తేలిగ్గా ఎలా తస్కరించబడుతోంది? డిజిటల్ గుర్తింపు కార్డుల భవిష్యత్తు ఏంటనే భయం అందరిలోనూ మొదలైంది.

12 రాష్ట్రాల్లో ఏజెంట్లు…
ఉత్తరప్రదేశ్‌లోని బదాయూన్, అమ్రోహా ప్రాంతాలకు చెందిన కొందరు నేరగాళ్లు ఆధార్ కార్డుల బయోమెట్రిక్ డేటాను అక్రమంగా మార్చడంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. ఈ విషయం తెలుసుకున్న యూపీ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి, ఈ మోసానికి సూత్రధారులుగా అనుమానిస్తున్న నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా ఏకంగా 1,500 అంతకంటే ఎక్కువ ఆధార్ కార్డుల సమాచారాన్ని తారుమారు చేసినట్లు తేలింది. వీళ్ల మోసాలు కేవలం యూపీకే పరిమితం కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీతో సహా 12 రాష్ట్రాల్లో ఈ దందా సాగింది. ఈ ముఠా ఆధార్ కార్డుల్లోని పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లాంటి ముఖ్యమైన వివరాలను మార్పుచేసి ఒక్కో కార్డుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు బాధితుల నుంచి వసూలు చేసేది.

సిలికాన్ వేలిముద్రల మాయ…
ఈ ముఠాలో కీలక పాత్ర పోషించిన అశీష్ కుమార్ అనే ఇంజనీరింగ్ చదువు మధ్యలో ఆపేసిన ఆ వ్యక్తి ఆధార్ వ్యవస్థలోని బలహీనతలను కనిపెట్టి వాటిని తన నేరాలకు వాడుకున్నాడు. ఆధార్, పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ల మాదిరిగానే నకిలీ వెబ్‌సైట్‌లను తయారు చేశాడు. వాటి ద్వారా తప్పుడు సమాచారం అప్‌లోడ్ చేసి, అసలైన ఆధార్ ఆపరేటర్ల బయోమెట్రిక్ డేటాను రహస్యంగా కాపీ చేశాడు. అంతేకాదు సిలికాన్‌తో నకిలీ వేలిముద్రలు తయారుచేసి, ఆధార్ పోర్టల్‌లోని ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా వీళ్లు కనిపెట్టారు. ఈ కొత్త టెక్నాలజీతో వాళ్లు ఎక్కడి నుంచైనా లాగిన్ అయి, బయోమెట్రిక్ డేటాను అక్రమంగా అప్‌లోడ్ చేయగలిగారు.

దేశవ్యాప్తంగా 300 మంది ఏజెంట్లు…
ఈ నేర ముఠా ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. దేశవ్యాప్తంగా 200 నుంచి 300 మంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా తమ పనిని విస్తరించింది. ఈ ఏజెంట్లు ప్రజల నుంచి కావలసిన పత్రాలు సేకరించి, వాటిని ఆధార్ కార్డుల్లో మార్పులు చేయడానికి ఈ ముఠాకు పంపేవారు. దర్యాప్తులో వీళ్లు రేషన్ కార్డుల్లో కూడా పేర్లు, చిరునామాలు మార్చడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితులపై ఆధార్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సంభల్ జిల్లా ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఈ మోసం ఆధార్ వ్యవస్థ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

బయోమెట్రిక్ లాకే రక్షణ కవచం…
ఈ ఘటనతో ఆధార్ కార్డు ఉన్న ప్రజలందరూ భయపడుతున్నారు. మీ బయోమెట్రిక్ డేటా ఎవరూ వాడకుండా కాపాడుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎం-ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మీ బయోమెట్రిక్‌లను లాక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ భద్రతా నిపుణులు మాట్లాడుతూ, ప్రజలు తమ ఆధార్ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని, బయోమెట్రిక్ లాక్ చేయడం వల్ల అక్రమ వినియోగాన్ని ఆపవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ కేసు డిజిటల్ భద్రతా వ్యవస్థలను మరింత బలంగా తయారు చేయాల్సిన అవసరాన్ని చూపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *