- హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
- ముదురుతున్న కంచ గచ్చిబౌలి వివాదం
- ఏఐతో తప్పుడు సమాచారం వ్యాప్తే కారణం
సహనం వందే, హైదరాబాద్:
కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతకు సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారు చేసిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ వివాదంలో సినీ నటి దియా మీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఏఐతో రచ్చ రచ్చ…
హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద భూమి తమ విశ్వవిద్యాలయానికి చెందినదని వాదిస్తున్నారు. చెట్ల నరికివేతకు సంబంధించిన కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించారని, అవి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది.”ఏఐ ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సమాజంలో గందరగోళం సృష్టిస్తుంది. దీనిని సీరియస్గా తీసుకుని చట్టపరంగా వ్యవహరిస్తాం” అని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.
చట్టం నరికివేతపై అవగాహనే దియా ఉద్దేశం…
దియా మీర్జా తన సామాజిక మాధ్యమాల ద్వారా చెట్ల నరికివేతపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. అయితే ఈ కంటెంట్ తప్పుదారి పట్టించేలా ఉంటే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉండగా, పూర్తి విచారణ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెలబ్రిటీలు ఎదుర్కొనే చట్టపరమైన సవాళ్లపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.