పేదల కడుపు నింపే సన్నబియ్యం

  • లబ్దిదారుడి ఇంట్లో సీఎం సహపంక్తి భోజనం!

సహనం వందే, భద్రాచలం:
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లబ్దిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను వివరాలు అడిగారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు వాటిని తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని చెప్పిన తులసమ్మ, ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుతున్నాయా అని ముఖ్యమంత్రి వారి నుంచి ఆరా తీశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తమకు ఎంతో ఉపయోగపడుతుందని తులసమ్మ ఆనందం వ్యక్తం చేశారు.

శ్రీ సీతారామ స్వామి కల్యాణంలో…
భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *