జగన్ టెన్షన్

  • వైసీపీ నాయకులపై కేసులతో అధినేత ఆందోళన
  • పోసాని, వల్లభనేనీలు జైల్లో ఉండటంతో కార్యకర్తల్లో నిరాశ
  • క్విడ్ ప్రో కో కేసు బెయిల్ రద్దు చేయించి జగన్ ను జైలుకు పంపాలని కుట్ర
  • ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలపై టీడీపీ కూటమి నేతల ఒత్తిడి
  • పార్టీని కాపాడుకోవడం ఇప్పుడు జగన్ కు కత్తి మీద సామే

సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తత రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వరుస కేసులతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి వంటి కీలక నేతలు ఇప్పటికే జైలు పాలవగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై ఇప్పటికే నమోదైన క్విడ్ ప్రోకో వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను ఆధారంగా చేసుకుని ఆయన బెయిల్‌ను రద్దు చేయించి ఎలాగైనా జైలుకు పంపేందుకు టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

వరుస అరెస్టులతో వైఎస్ఆర్సీపీలో ఆందోళన…
గత కొన్ని వారాలుగా వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్ ఆరోపణలతో హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు. అదే విధంగా టీడీపీ, జనసేన నేతలపై నటుడు పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో 17 కేసులు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అలజడి నెలకొంది. జగన్ స్వయంగా వంశీని జైలులో కలిసి, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపించారు. పోసాని అరెస్టును ఖండిస్తూ, ఆయన భార్య కుసుమలతకు ఫోన్ చేసి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

జగన్‌పై సీబీఐ-ఈడీ కేసుల ఒత్తిడి…
కూటమి ప్రభుత్వం ఇప్పుడు జగన్‌ను టార్గెట్ చేసేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది. జగన్‌పై ఇప్పటికే క్విడ్ ప్రోకోకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనకు గతంలో బెయిల్ మంజూరైనప్పటికీ, దాన్ని రద్దు చేయించి జగన్‌ను మళ్లీ జైలుకు పంపేందుకు టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జగన్‌ను కూడా జైలుకు పంపాలని టీడీపీ కార్యకర్తలు తమ అధినేత ముందు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతూ, కేంద్ర ఏజెన్సీలైన సీబీఐ, ఈడీలను ఉపయోగించి జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు సమాచారం.

కక్షసాధింపు అంటున్న వైఎస్ఆర్సీపీ…
వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కేసులను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. “చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోంది. జనం ఈ అన్యాయాలను చూస్తున్నారు, తగిన సమయంలో సమాధానం చెబుతారు,” అని జగన్ హెచ్చరించారు. వంశీ, పోసాని కేసుల్లో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, టీడీపీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మరోవైపు, టీడీపీ, జనసేన వర్గాలు ఈ కేసులు చట్టపరమైన ఆధారాలతోనే నమోదవుతున్నాయని, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలకు ఇప్పుడు శిక్ష పడుతోందని వాదిస్తున్నాయి. “జగన్ పాలనలో టీడీపీ నేతలపై వేధింపులు జరిగాయి. ఇప్పుడు న్యాయం జరుగుతోంది,” అని టీడీపీ నేతలు అంటున్నారు.

జగన్ కుటుంబంలో టెన్షన్…
జగన్‌పై కేసులు ముదిరి, బెయిల్ రద్దైతే ఆయన మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చన్న ఆందోళనలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో ఏర్పడిన కసి ఇప్పుడు ఆయనపై ప్రతీకార రూపంలో వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. క్విడ్ ప్రో కోపై సీబీఐ-ఈడీ దర్యాప్తులు తీవ్రమైతే జగన్‌కు చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ చట్టపరమైన సలహాలు తీసుకుంటూ, పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఈ రాజకీయ డ్రామా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కేసుల భయంతో అల్లాడుతుండగా, కూటమి ప్రభుత్వం మాత్రం తమ చర్యలు న్యాయబద్ధమని సమర్థిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *