- పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
- నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిక
- బీసీ రిజర్వేషన్లపై ప్రధానిని ఒప్పించే దమ్ముందా అని నిలదీత
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రధానిని ఒప్పించే దమ్ము బండి సంజయ్ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేసిన పనులు బండి సంజయ్ మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర బండి సంజయ్ ది అని ఆయన ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ తో బీజేపీ చీకటి ఒప్పందం…
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయని ఆయన అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ లు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే రహస్య మిత్రులైన బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. బండి సంజయ్ లో రోజురోజుకు అభద్రతా భావం పెరిగిపోతోందని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ కనీసం టిఫిన్ కూడా చేయరని ఆయన ఎద్దేవా చేశారు. సొంత పార్టీ కార్యకర్తలే బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగం అవుతున్నారని ఆయన అన్నారు. గుర్తింపు కోసమే తాను కేంద్ర మంత్రిని అని మరిచిపోయి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీలో ఉనికి కోసం బండి సంజయ్ ఆరాటపడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి బండి సంజయ్ కి కనిపించకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు. సుదీర్ఘ కాలం అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించలేకపోయిందని, కాంగ్రెస్ హైకమాండ్ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని ఆయన అన్నారు.
రేవంత్ వల్లే బీసీ రిజర్వేషన్లు…
సీఎం రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించబట్టే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందని, అవగాహన లేకుండా బండి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. హెచ్ సి యూ అంశం ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉందని, ప్రభుత్వం కమిటీ వేసిందని, రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. మైనార్టీ హక్కుల కోసం నిలబడి కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు బిల్లుపై నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. కార్పొరేట్ సంస్థలను భయపెట్టి నిధులు రాబట్టుకున్న బీజేపీ నంబర్ వన్ గా నిలిచిందని ఆయన ఆరోపించారు. సన్న బియ్యం బీజేపీ ఇస్తుంటే దేశం మొత్తం ఇవ్వొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. సన్న బియ్యంతో తెలంగాణలో నిరుపేదలకు అసలైన పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే కుల గణన, బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యంను కాంగ్రెస్ హయాంలో అమలు చేశారని ఆయన తెలిపారు.