- ప్రతిరోజు 10,000 మందికి వితరణ
- ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దురెడ్డి కందకట్ల
- శంషాబాద్ లో మజ్జిగ పంపిణీ కేంద్రం ప్రారంభం
సహనం వందే, రాజేంద్రనగర్:
మజ్జిగ తాగండి… తనను ఆశీర్వదించండి అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దురెడ్డి కందకట్ల పిలుపునిచ్చారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం శంషాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆయన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దురెడ్డి మాట్లాడుతూ… వేసవికాలంలో కొందరు నీళ్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదార స్వభావంతో వారికోసం మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. శంషాబాద్ లో కూలీలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వేలాదిమంది బస్టాండ్ సమీపంలో ఉంటారని పేర్కొన్నారు. వారందరి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేశానని వివరించారు. ఇళ్లల్లో తయారు చేసుకునే విధంగా ఎంతో నాణ్యతగా మజ్జిగను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల దాహార్తి తీర్చడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రోజు సుమారు పది వేల మందికి మజ్జిగ పంపిణీ చేస్తామని సిద్దురెడ్డి కందకట్ల పేర్కొన్నారు. వేసవి పూర్తయ్యే వరకు మజ్జిగ కేంద్రం కొనసాగుతుందన్నారు. సమాజం నుంచి మనం ఏం తీసుకుంటున్నామని కాకుండా… సమాజానికి మనం ఏమిస్తున్నామన్నది ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు భారీగా పాల్గొన్నారు.
