- నాగబాబుకు నిరసనల సెగ
- వర్మ అధ్యాయం ముగింపునకు స్కెచ్
సహనం వందే, పిఠాపురం:
జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఇటీవల పిఠాపురం పర్యటనలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. కుమారపురంలో జరిగిన ఈ సంఘటనలో వర్మ వర్గీయులు నాగబాబును చుట్టుముట్టి “జై వర్మ” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ వర్మల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణలను మరోసారి ఉద్ధృతం చేసింది. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంగా ఉన్న పిఠాపురంలో ఈ వివాదం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.
వర్మ వైఖరిపై జనసేన ఆగ్రహం…
2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి తన అభ్యర్థిత్వాన్ని వర్మ త్యాగం చేసి పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వర్మ వైఖరి జనసేన నాయకులను అసంతృప్తికి గురిచేస్తోంది. వర్మ తన సొంత రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ, జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమంలో వర్మ అనుచరులు జనసేన ఇన్చార్జ్ను అడ్డుకోవడం, నినాదాలతో నిరసన తెలపడం వంటి సంఘటనలు ఈ విభేదాలను మరింత పెంచాయి.
టీడీపీ హైకమాండ్ స్పందన
వర్మ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వర్మకు సర్దుకోమని సూచనలు ఇచ్చినప్పటికీ, వర్మ వర్గీయులు జనసేన పిఠాపురంలో ఏకపక్ష ఆధిపత్యం సాధించేందుకు తమ నాయకుడిని పక్కనపెడుతోందని ఆరోపిస్తున్నారు. “మా సేవలను గుర్తించకపోతే పవన్ కళ్యాణ్ విజయం సాధ్యం కాదు” అంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జనసేన వ్యూహం…
జనసేన పార్టీ పిఠాపురంలో తన స్వతంత్ర బలాన్ని స్థిరపరచుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. వర్మతో సంబంధాలను తెంచుకొని, టీడీపీ ప్రభావం నుంచి విడిపోయి స్వతంత్ర్యంగా పనిచేయాలని భావిస్తోంది. అయితే ఈ ఘర్షణలు టీడీపీ-జనసేన కూటమి సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ అధ్యాయం ముగిసిపోయినట్లేనా? లేక ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చనుందా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.