ప్రభుత్వానికి రైతు కమిషన్ స్పష్టీకరణ
– ములుగు ఘటన నేపథ్యంలో నివేదిక
– వ్యవసాయశాఖను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖగా మార్చాలని సూచన
సహనం వందే, హైదరాబాద్:
విత్తనం రైతు హక్కు అని, దానిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేఖ రూపంలో రైతు కమిషన్ నివేదికను అందించింది. విత్తనం, వ్యవసాయ మార్కెట్ చట్టాల్లో వెంటనే సవరణలు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. ములుగు ఘటన పునరావృతం కాకుండా చూడాలని కమిషన్ కోరింది.
ములుగు ఘటన నేపథ్యంలో నివేదిక…
ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతుల సంఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై శాంతి కుమారికి వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ను కలిసిన రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు ప్రతిపాదన లేఖను అందించారు.
ఏటూరు నాగారం రైతుల కష్టాలు…
ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న విత్తన సాగు చేస్తున్న రైతులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రైతు కమిషన్ నిజనిర్ధారణ కమిటీ వేసి క్షేత్ర స్థాయిలో పర్యటించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నష్టపోయిన రైతులకు తగు నష్టపరిహారం చెల్లించే చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది.
చట్టాల్లో లోపాలపై కమిషన్ ఆందోళన…
ములుగులో జరిగిన సంఘటన విత్తన, మార్కెట్ చట్టాల లోపాలను ఎత్తి చూపుతున్నాయని కమిషన్ తన లేఖ ద్వారా స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ల చట్టాలకు చేసిన కొన్ని సవరణలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల చట్టం, విత్తన చట్టంలో తేవాల్సిన మార్పులపై వ్యవసాయ కమిషన్ పలు సూచనలు చేసింది.
కమిషన్ ప్రధాన సూచనలు
– వ్యవసాయ మార్కెట్ల చట్టంలోని కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించిన సెక్షన్ 11ఏలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్పు చేసి, కంపెనీలకు ఎలాంటి బాధ్యత లేకుండా ఆర్గనైజర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సెక్షన్ను సవరించి 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొనసాగించాలని సూచించింది.
– కేంద్రం చేసిన విత్తన చట్టంలో నకిలీ విత్తనాల తయారీ, అమ్మకాలు చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి కఠినతరమైన నిబంధనలు లేవు.
– మహారాష్ట్ర చేసినట్లుగా విత్తన చట్టం సవరించి నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
– రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖగా మార్చాలని కమిషన్ సూచించింది.