హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ పంజా

   వేల కోళ్లు మృతి… ప్రజల్లో భయాందోళనలు
– నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతితో అప్రమత్తం

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పౌల్ట్రీ ఫార్మ్‌లో వేల కోళ్లు చనిపోవడంతో ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా, బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, కోడిగుడ్లు, చికెన్ విక్రయాలను నిషేధించారు. ఈ విషయం తెలియడంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళనలో ఉండగా, చికెన్ తినే వారిలో భయం నెలకొంది.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో బర్డ్‌ఫ్లూ గుర్తింపు…
హైదరాబాద్ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫార్మ్‌లో ఈ సమస్య మొదలైంది. నాలుగు రోజుల క్రితం అక్కడ వేలాది కోళ్లు మరణించాయి. అనుమానం వచ్చిన అధికారులు శాంపిల్స్ సేకరించి పరీక్షించగా, బర్డ్‌ఫ్లూ సోకినట్లు తేలింది. వెంటనే కోడిగుడ్లు, చికెన్ అమ్మకాలను ఆపాలని పౌల్ట్రీ యజమానులకు సూచించారు.

నర్సరావుపేట ఘటన తర్వాత…
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మరణించిన సంఘటన అందరినీ కలవరపెట్టింది. ఆ ఘటన తాజాగా ఉండగానే, హైదరాబాద్‌లో ఈ వైరస్ ఆవిష్కృతం కావడం ఆందోళన కలిగించింది. అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించడంతో ప్రజల్లో భయం పెరిగింది.

ప్రజల్లో ఆందోళన… అధికారుల చర్యలు
చికెన్ తినడం సురక్షితమని భావించి ఇటీవలే దానిపై ఆసక్తి చూపిన వారు, ఈ వార్తతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పౌల్ట్రీ యజమానులు తమ వ్యాపారం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మనుషులకు ప్రమాదం ఉందా?
వైద్య నిపుణుల ప్రకారం, బర్డ్‌ఫ్లూ వైరస్ సాధారణంగా మనుషులకు సోకదు. అయితే, కొన్ని సందర్భాల్లో జలుబు లేదా శ్వాసకోశ సమస్యలు వస్తాయని, అరుదుగా ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు. కోళ్లు, వాటి వ్యర్థాలతో సంబంధం లేకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *