ఉత్తరాది చేతుల్లోకి దక్షిణాది వ్యాపార సామ్రాజ్యం
– దక్షిణాదిలో ఉత్తరాది వ్యాపార వాటా 40%
– హైదరాబాదులో స్వీట్స్ నుంచి బంగారం వరకు ఉత్తరాధిపత్యం
– హైదరాబాద్ నుంచి మొదలు విజయవాడ, చెన్నై, బెంగుళూర్ వరకు వ్యాపార విస్తరణ
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్తరాది నుంచి వలస వచ్చిన మార్వాడీలు స్థానిక వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎత్తులు, జిత్తులతో స్థానిక వ్యాపారస్తులను తొక్కేస్తూ వీరు వ్యాపార రంగంలో ఆధిపత్యం సాధిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ ఈ ఆక్రమణ స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణాది నగరాలైన చెన్నై, బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి. తక్కువ ధరలు, ఆకర్షణీయ ఆఫర్లతో స్థానిక వ్యాపారుల సరుకులను ప్రజలు కొనకుండా చేస్తూ కుట్రలు పన్నుతున్నారు.
స్థానిక వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకం…
ఉత్తరాది వ్యాపారులు కిరాణా, బట్టలు, స్వీట్స్, బంగారం, హోల్సేల్, రిటైల్ దుకాణాలతో పాటు హోటళ్ల వ్యాపారంలోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. భారీ పెట్టుబడులతో సరుకులను తక్కువ ధరకు అమ్ముతూ స్థానిక వ్యాపారులను పోటీలో ఓడిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో స్వీట్స్ రంగంలో సుప్రసిద్ధమైన పుల్లారెడ్డి స్వీట్స్ స్థానాన్ని ఇప్పుడు దాదూస్, బికానెర్వాలా, హల్దీరామ్ వంటి ఉత్తరాది బ్రాండ్లు ఆక్రమించడానికి కుతంత్రాలు పన్నుతున్నాయి. ఎలాగైనా పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిరాణా రంగంలో స్థానిక వ్యాపారులు నాణ్యమైన సరుకులు అమ్ముతున్నప్పటికీ, మార్వాడీలు తక్కువ ధరకు నాసిరకం వస్తువులను అందించడంతో కస్టమర్లు అటువైపు మళ్లుతున్నారు. బట్టల వ్యాపారంలో గుజరాతీ బ్రాండ్లు స్థానిక దుకాణాలను మూలకు నెట్టాయి.
50 శాతం వరకు ఉత్తరాది వాటానే…
హైదరాబాద్లో ఉత్తరాది వ్యాపారులు కిరాణా, స్వీట్స్, బంగారం, హోటళ్లలో దాదాపు 40% వాటా సాధించారు. రాడిసన్ కలెక్షన్ (2026లో ప్రారంభం), వెస్టిన్ హైటెక్ సిటీ వంటి హోటళ్లు స్థానిక హోటళ్లకు పోటీగా నిలుస్తున్నాయి. బెంగళూరులో రాడిసన్ (11 కొత్త హోటళ్లు), మారియట్ మాక్సీ, ఇంటర్కాంటినెంటల్ వైట్ఫీల్డ్ వంటి బ్రాండ్లు వ్యాపార హోటళ్లలో 50% వాటా కలిగి ఉన్నాయి. చెన్నైలో తాజ్, మారియట్ మాక్సీ, పీసీ జ్యూయలర్స్ వంటి బ్రాండ్లు 35-40% మార్కెట్ ఆక్రమించాయి. విజయవాడలో నోవోటెల్, మారియట్ హోటళ్లు, తనిష్క్ వంటివి 30% వాటాతో విస్తరించాయి. విశాఖపట్నంలో రాడిసన్, జోయ్ ఆలుక్కాస్ వంటి బ్రాండ్లు 25-30% వాటా సాధించాయి. రాజమండ్రి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మార్వాడీ హోల్సేల్ కిరాణాలు 20-25% వాటాతో స్థానిక వ్యాపారులను దెబ్బతీస్తున్నాయి. మొత్తం దక్షిణాది వ్యాపారంలో ఉత్తరాది వాటా సుమారు 30-35% ఉంటుందని అంచనా.
మార్వాడీల వ్యూహాత్మక ఆధిపత్యం…
మార్వాడీలు ఆర్థిక బలంతో ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తూ స్థానిక వ్యాపారులను దెబ్బతీస్తున్నారు. హోల్సేల్ ధరలను తగ్గించి, స్థానిక వ్యాపారులను పక్కకు నెడుతున్నారు. హైదరాబాద్లో బేగం బజార్లో స్థానిక వ్యాపారుల హవా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మార్వాడీ హోల్సేల్ దుకాణాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సికింద్రాబాద్, కోఠీలో స్థానిక దుకాణాలు వెలవెలబోతుండగా, ఉత్తరాది దుకాణాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. బంగారంలో జోయ్ ఆలుక్కాస్, తనిష్క్ వంటి బ్రాండ్లు స్థానిక జ్యూయలరీ షాపులను మూలకు నెట్టాయి.
ఉత్తరాది బ్రాండ్ల ఆధిపత్యం…
విజయవాడలో తనిష్క్ 25% వాటా సాధించింది. విశాఖపట్నంలో జోయ్ ఆలుకాస్, తనిష్క్ 20% వాటాతో స్థానిక దుకాణాలకు పోటీ ఇస్తున్నాయి. చెన్నైలో పీసీ జ్యూయలర్స్, జోయ్ ఆలుక్కాస్ 35% వాటా కలిగి ఉన్నాయి. ఇతర వ్యాపారాల్లో హైదరాబాద్లో బికానెర్వాలా, హల్దీరామ్, బెంగళూరులో ఫస్ట్క్రై స్థానిక వ్యాపారులను దెబ్బతీస్తున్నాయి.
కార్పొరేట్ మాల్స్ లోనూ ఉత్తరాది ప్రభావం…
కార్పొరేట్ షాపింగ్ మాల్స్, ఉత్తరాది వ్యాపారుల దూకుడు వల్ల స్థానిక వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. హైదరాబాద్లో మాలక్పేట్, వనస్థలిపురం రైతు బజార్, ఎల్బీ నగర్లో దుకాణాలు ఖాళీగా ఉంటున్నాయి. వ్యాపారులు మొబైల్లో సినిమాలు, సీరియల్స్ చూస్తూ కాలం గడుపుతున్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు సరిపడక “టూ-లెట్” బోర్డులు కనిపిస్తున్నాయి. చెన్నై, బెంగళూరు, ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి. అప్పులు ఇచ్చే వారు కరువై, చిట్టీలు కట్టలేని దుస్థితిలో వ్యాపారులు ఉన్నారు.
ప్రభుత్వ జోక్యం అవసరం…
స్థానిక వ్యాపారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉత్తరాది ఆధిపత్యాన్ని అరికట్టి, స్థానిక వ్యాపారులకు ఆర్థిక సాయం, మార్కెట్ అవకాశాలు కల్పించాలి. పుల్లారెడ్డి స్వీట్స్ వంటి స్థానిక బ్రాండ్లను కాపాడాలి. లేకపోతే, ఈ సంక్షోభం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది.