అమెజాన్ అడవుల లీజుకు నిత్యానంత కుట్ర

4.8 లక్షల హెక్టార్ల భూమి వెయ్యేళ్ళు లీజుకు ఫ్లాన్

సహనం వందే, హైదరాబాద్:
లైంగిక వేధింపులు, చిన్నారుల కిడ్నాప్‌ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి మరోసారి అంతర్జాతీయ కుంభకోణానికి తెరలేపాడు. ఈసారి అతని గురి దక్షిణ అమెరికాలోని బొలీవియాపై పడింది. తన కల్పిత దేశం ‘కైలాస’ ముసుగులో అక్కడి ఆదివాసీ భూములను కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు.

వెయ్యేళ్ల లీజు డ్రామా..‌.
బొలీవియా ప్రభుత్వం నిత్యానంద ‘కైలాస’కు చెందిన 20 మంది అనుచరులను అరెస్ట్ చేసింది. వీరు అక్కడి ఆదివాసీలతో వెయ్యేళ్ల లీజు ఒప్పందం పేరుతో అమెజాన్ అడవుల్లోని 4.8 లక్షల హెక్టార్ల భూమిని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఇది భూ దోపిడీ అని తేల్చిన బొలీవియా అధికారులు, నిత్యానంద అనుచరులను దేశం నుంచి తరిమేశారు.

అంతర్జాతీయ మోసగాడు!
నిజానికి నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. తమిళనాడుకు చెందిన ఈ మోసగాడు, 2019లో దేశం విడిచి పారిపోయాడు. లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ స్వామి, తనను తాను ‘హిందూ సుప్రీం పాంటిఫ్’గా ప్రకటించుకున్నాడు. ఆ తరువాత ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ అనే కల్పిత దేశాన్ని సృష్టించి, హిందువులకు ప్రత్యేక రాజ్యం అంటూ ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నించాడు.

బొలీవియా ప్రభుత్వం హెచ్చరిక: 
కైలాసతో సంబంధాలు లేవు”బొలీవియాకు ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ అనే దేశంతో ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు” అని బొలీవియా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆదివాసీ భూములను కబ్జా చేయడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండించింది. భూమి చట్టాలను ఉల్లంఘించినందుకు నిత్యానంద అనుచరులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

ఎక్కడికక్కడ బురిడీలు…
నిత్యానంద ‘కైలాస’ ముఠా గతంలో ఈక్వెడార్‌లోని ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బొలీవియాలో భూ ఆక్రమణ ప్రయత్నంతో అతని మోసాలు మరింత వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో అతనిపై ఉన్న కేసులు ఏమాత్రం పురోగతి సాధించకపోవడంతో, అతను ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఈ ఘటనతో నిత్యానంద మరోసారి తన మోసాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. బొలీవియా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అతని పన్నాగానికి అడ్డుకట్ట వేసినప్పటికీ, రానున్న రోజుల్లో అతను ఎలాంటి మోసాలకు పాల్పడతాడో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *