బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్యబట్టు
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్యబట్టు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించాలనుకున్న యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 14వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరకాస్తులు ఆన్లైన్ పద్దతిలో లేదా మాన్యువల్ పద్దతిలో సమర్పించవచ్చు. ఆన్లైన్ పద్దతిలో ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా సమర్పించాలి. మాన్యువల్ పద్దతిలో మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సంబంధిత ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తును సమర్పించాలి. 2016 తర్వాత మీసేవా కేంద్రం ద్వారా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రంతో పాటు రేషన్ కార్డు లేదా తాజాగా మీసేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), గిరిజనులు(ఎస్టీ), వెనుకబడిన తరగతులు(బీసీ), ఆర్థికంగా వెనుకబడిన కులాలు(ఈబీసీ/ఈడబ్ల్యూఎస్), దివ్యాంగ యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.