అకాల వర్షం… నగరం జలమయం…!
– రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు
– గ్రేటర్ పరిధిలో కుండపోత వాన… చెరువులను తలపించిన రోడ్లు
సహనం అంతే, హైదరాబాద్:
ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావతమై క్రమంగా జల్లులతో మెదలైన వాన… ఆ తర్వాత తీవ్రత పెంచింది. గ్రేటర్ హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతమే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత చినుకులుగా మొదలై… పలు ప్రాంతాల్లో కుండపోతగా మారింది. దీంతో ఒక్కసారిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ తర్వాత నాళాలు పొంగడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. కీలక రద్దీ సమయంలో భారీ వర్షం కురవడం… రోడ్లు జలమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ వర్షపునీరు నిలవడంతో అధికారులు అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టారు. కానీ తక్షణ పరిష్కారం లేకపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో గంటల వ్యవధిలోనే జోరు వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల వడగండ్ల వానలు సైతం నమోదయ్యాయి. రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం రాత్రి 8 గంటల నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్లో 9.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లా హిమాయత్ నగర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో 9.10 సెంటీమీటర్లు, చార్మినార్లో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరత్వాడ, దానికి సమీపంలోని మధ్య మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు నుంచి బలమైన గాలులకు తోడుగా… ఉపరితల చక్రవాక ఆవర్తనం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి నైరుతి మధ్యప్రదేశ్ వరకు కదిలింది. మరోవైపు ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో మరో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కి మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం రాష్ట్ర పరిధిలో ఉండడంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీ సెల్సీయస్ మేర తగ్గాయి. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే… గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్లో 39.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్లో 21.7 డిగ్రీ సెల్సీయస్గా నమోదైంది. శుక్రవారం కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదవుతాయని, శనివారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం…
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురు గాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని చెప్పారు. పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, ఇతర అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.