ఢిల్లీ బీసీ గర్జనకు రాహుల్ గాంధీ

   రేపు ఢిల్లీలో బీసీల మహాధర్నా
– 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
– తెలంగాణ నుంచి చారిత్రక పోరాటం

సహనం వందే, హైదరాబాద్:
ఢిల్లీలో మంగళవారం నిర్వహించే బీసీల మహాగర్జనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మహా ధర్నాకు రాహుల్ గాంధీ హాజరవడం దానికి రాజకీయ ప్రాముఖ్యత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర పార్లమెంట్‌లో ఆమోదింపజేసేందుకు బీసీ సంఘాలు ఢిల్లీలో భారీ ఎత్తున పోరాటానికి సిద్ధమయ్యాయి. ఈనెల 2న జంతర్ మంతర్ వద్ద జరిగే ‘బీసీల పోరుగర్జన మహా ధర్నా’ కోసం హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది బీసీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక రైలు ద్వారా బయలుదేరారు. ఈ ఉద్యమం దేశ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలవనుంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. అఖిలపక్ష నాయకులను కూడా ఆహ్వానించినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

50% రిజర్వేషన్ సీలింగ్‌కు కాలం చెల్లింది…
“ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తప్పనిసరి. ఒకవేళ అది జరగకపోతే, రెండో నెలలో మరో మహాధర్నాతో బీసీల బలం ఏంటో చూపిస్తాం” అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీజేపీ బీసీ బిల్లును ఆమోదిస్తే విజయోత్సవ సభ నిర్వహిస్తామని, లేకపోతే దేశవ్యాప్తంగా మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ఆయన స్పష్టం చేశారు. “50 శాతం రిజర్వేషన్ సీలింగ్‌కు కాలం చెల్లింది. అగ్రవర్ణ రిజర్వేషన్లకు ఒక న్యాయం, బీసీలకు మరో న్యాయమా?” అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ బృందం ఏప్రిల్ 2, 3 తేదీల్లో వివిధ పార్టీ నాయకులను కలిసి, కుల సర్వే వివరాలతో బీసీ బిల్లుకు మద్దతు కోరనుంది. “బీసీల ఓట్లతో గెలిచిన రాజకీయ పార్టీలు ఈ బిల్లు ఆమోదం ద్వారా తమ రుణం తీర్చుకోవాలి,” అని జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *