అందువల్ల పనిని ప్రేమిస్తే వారానికి 70 గంటలైనా ఒత్తిడి ఉండదు!
– ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు సమర్ధిస్తూ న్యూరాలజిస్ట్ సంచలన విశ్లేషణ!
– సినీ నటుడు మాధవన్ తో పాడ్ కాస్ట్ లో డాక్టర్ సిద్ వారియర్
సహనం వందే, హైదరాబాద్:
“మెదడుకు పని-విశ్రాంతి అనే భేదం తెలియదు. మీరు మీ పని పట్ల ఉత్సాహంగా, అభిరుచితో ఉంటే, అది ఒత్తిడిగా కాకుండా ఆనందంగా అనిపిస్తుంది,” అంటూ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ వారియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వారానికి 70 గంటలు పనిచేయాలని ఆ మధ్యకాలంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యానాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ఆ డాక్టర్ చేసిన ఈ విశ్లేషణ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కొందరు నారాయణమూర్తి ప్రతిపాదనను సమర్థిస్తూ, ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుందని వాదిస్తుండగా… మరికొందరు దీనివల్ల ఉద్యోగులపై ఒత్తిడి, బర్న్అవుట్ వంటి సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఒక ప్రముఖ న్యూరాలజిస్ట్ ఈ విషయంపై ఆసక్తికరమైన విశ్లేషణను అందించారు. పని పట్ల అభిరుచి, అంకితభావం ఉంటే ఎక్కువ గంటలు పని చేయడం అంత ఒత్తిడిగా అనిపించదని ఆయన తెలిపారు. డాక్టర్ సిద్ వారియర్… నటుడు ఆర్. మాధవన్తో జరిగిన పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, నారాయణమూర్తి వంటి వ్యక్తులు తమ సంస్థను తమ బిడ్డలా భావిస్తారని, అందుకే వారికి ఎక్కువ గంటలు పని చేయడం భారంగా అనిపించదని డాక్టర్ వారియర్ అభిప్రాయపడ్డారు.
నాకు సొంత ఆస్పత్రి ఉంటే 24/7 పనిచేస్తా…
“నాకు నా సొంత ఆసుపత్రి ఉంటే, నేను 24/7 అక్కడ ఉండగలను. ఎందుకంటే అది నా సొంతం కాబట్టి. నా మెదడు దాన్ని పనిగా భావించదు,” అని డాక్టర్ వారియర్ ఉదాహరణ ఇచ్చారు. అదే విధంగా, ఇన్ఫోసిస్ను నారాయణమూర్తి తన బిడ్డలా చూసుకున్నారని, అందుకే ఆయనకు 70 గంటలు పని చేయడం సహజంగా అనిపించిందని ఆయన తెలిపారు. అయితే, ఉద్యోగుల విషయంలో ఈ అనుభవం భిన్నంగా ఉంటుందని, వారికి అదే స్థాయి అభిరుచి లేకపోతే ఒత్తిడి తప్పదని ఆయన స్పష్టం చేశారు. నారాయణ మూర్తి తన వ్యాఖ్యలలో భారతదేశం ఉత్పాదకతను పెంచాలంటే యువత ఎక్కువ గంటలు కష్టపడాలని సూచించారు. దీనిపై విమర్శలు వచ్చినప్పటికీ, పని పట్ల అభిరుచి ఉంటే ఒత్తిడి తగ్గుతుందన్న న్యూరాలజిస్ట్ వాదన ఈ చర్చకు కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఉద్యోగులకు పని పట్ల సరైన అభిరుచి, అంకితభావం లేకపోతే, ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్ సిద్ వారియర్ తెలిపారు. దీనిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది.