– ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రకటన
సహనం వందే, విజయవాడ:
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందించే బాధ్యత తనదేనని ఆయన అన్నారు.
సాంకేతికత ప్రాముఖ్యత…
20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి తాను చెప్పానని, తన మాట విని ఆ రంగం వైపు వెళ్లిన వారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారని సీఎం అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సాధారణ వ్యక్తులు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన యువతకు సూచించారు. అధికంగా డబ్బు సంపాదించే తెలివి తేటలున్న వారు భారతీయులేనని చంద్రబాబు అన్నారు. సమాజం వల్ల ఉన్నత స్థాయికి చేరుకున్నవారు తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పేదరికం లేని రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే పీ-4 విధానం తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు.