‘డ్రగ్స్’ సరఫరా అడ్డాగా మహానగరం
– కొకైన్, హెరాయిన్ ముడి పదార్థాల రవాణా
– ఔషధ ఉత్పత్తుల మాటున డ్రగ్స్ దందా
– ఇప్పుడు వసుధ ఫార్మా… 2017లో మరోటి
– అప్పుడు కొకైన్ తయారీ ముడి పదార్థాలు
– అమెరికా, మెక్సికో వంటి దేశాలకు రవాణా
– తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాల మౌనం
– అనకాపల్లి అడ్డా చెప్పి తప్పించుకున్న యంత్రాంగం
సహనం వందే, హైదరాబాద్
డబ్బు కోసం ఫార్మా కంపెనీలు గడ్డికరుస్తున్నాయి. లాభాల కోసం అనైతిక చర్యలకు ఒడిగట్టుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా మనుషులకు అవసరమైన, వారి ఆరోగ్యాలను కాపాడే ఔషధాలను తయారు చేయాల్సింది పోయి… దాని మాటున మత్తు కలిగించే డ్రగ్స్ ముడి పదార్థాలను ప్రపంచ దేశాలకు రవాణా చేస్తున్నాయి. తాజాగా వసుధ ఫార్మా కెమ్ కంపెనీ ప్రమాదకర ఫెంటానిల్ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను ఈ కంపెనీ ఏకంగా అమెరికాకే సరఫరా చేయడంతో భారతీయులు కంగుతున్నారు. దీంతో ఆ కంపెనీ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్లను అమెరికా ఫెడరల్ ఏజెన్సీ అరెస్టు చేయడంతో హైదరాబాద్ పరువు గంగలో కలిసింది. ఈ ఘటనతో హైదరాబాద్లోని ఫార్మా సంస్థలు నిషేధిత డ్రగ్స్ ముడి పదార్థాల సరఫరాకు కేంద్రంగా మారుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2017లో కొకైన్, హెరాయిన్ తయారీ ముడి పదార్థాలు…
హైదరాబాదులోని ఫార్మా కంపెనీలు గతంలోనూ ఇలాంటి పిచ్చి పనులు చేశాయి. లాభం కోసం ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా వ్యవహరించాయి. 2017లో హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ కొకైన్, హెరాయిన్ తయారీకి సంబంధించిన కెమికల్స్ను మెక్సికోకు ఎగుమతి చేసింది. భారత డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (డీఈఏ) దాడులు చేసి పలువురిని అరెస్టు చేసింది. అమెరికాకు ఓపియాయిడ్ ప్రికర్సర్స్ అక్రమంగా ఎగుమతి చేసిన కేసులో అమెరికా సంబంధిత అధికారులను అరెస్టు చేసింది. భారత్లో దర్యాప్తు జరిగింది. అనంతరం సంస్థ లైసెన్స్ రద్దయింది. అలాగే 2020లో మరో హైదరాబాద్ ఫార్మా సంస్థ మెథాంఫెటమైన్ (మెథ్) తయారీకి ప్రికర్సర్ కెమికల్స్ను ఆసియా దేశాలకు సరఫరా చేసింది. ఈ ఘటనలో భారత అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఎదుగుతున్నా కొద్దీ కక్కుర్తి పనులు…
హైదరాబాద్ భారత ఔషధ ఎగుమతుల్లో 40% వాటా కలిగి, ప్రపంచ జనరిక్ మందుల సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఫార్మా ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉంది. 2022-23లో భారత ఔషధ ఎగుమతులు 25.39 బిలియన్ డాలర్లుగా నమోదవగా, హైదరాబాద్ వాటా సుమారు రూ. 80,000 కోట్లుగా ఉంది. ఈ విలువ ప్రతి ఏటా 8-10% వృద్ధి చెందుతోంది.
హైదరాబాద్ పరిధిలో 800కు పైగా ఫార్మా కంపెనీలు ఉండగా, ఈ రంగంలో సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో వంటి ప్రముఖ సంస్థలు జనరిక్ మందులు, వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంతటి ఘనత సాధించిన హైదరాబాద్ కంపెనీలు మరోవైపు అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకునేలా వ్యవహరిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. ఫార్మా కంపెనీలతో రాజకీయ, అధికార పెద్దలకు ఉన్న సంబంధాల వల్లే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒక కంపెనీ సీఈఓ, డైరెక్టర్ మత్తు ముడి పదార్థాల తయారీ స్కామ్ లో అమెరికాలో అరెస్ట్ అయితే కనీసం ఆ కంపెనీ ఆఫీస్ దగ్గరికి వెళ్లడానికి కూడా జంకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక రెస్టారెంట్లో నాసిరకపు ఆహారం వండుతున్నారన్న ఆరోపణలు వస్తే చాలు హడావుడి చేసే నాయకులు, అధికారులు ఇంత పెద్ద కుంభకోణం జరిగితే మౌనం దాల్చడం వెనక అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అనకాపల్లిలో తయారీ:
కమలాసన్ రెడ్డి, డీజీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ:
వసుధ ఫార్మా కెమ్ రిజిస్టర్డ్ కార్యాలయం హైదరాబాదులోని వెంగళరావు నగర్లో ఉంది. దాని కార్పొరేట్ కార్యాలయం కావురి హిల్స్లో ఉంది. అయితే, ఫెంటానిల్ ప్రికుర్సర్ ఎన్-బీఓసీ-4-పైపెరిడోన్ ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి యూనిట్ 3, 5లలో తయారు చేస్తున్నారని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ శనివారం ప్రచురించిన “హైదరాబాద్ ‘డ్రగ్స్ తో అమెరికాలో మరణ మృదంగం” కథనంపై స్పందించారు.
ప్రత్యేకించి, అమెరికాకు పంపిన ఎన్-బీఓసీ-4-పైపెరిడోన్ ఆంధ్రప్రదేశ్లోని యూనిట్ 5లో తయారు చేసినట్టు తెలిపారు. వారి కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉన్నందున, “హైదరాబాద్-ఆధారిత సంస్థ” అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ, వాస్తవ తయారీ, అమ్మకం ఆంధ్రప్రదేశ్లోని వారి సైట్లో జరిగాయని ఆయన తెలిపారు.