వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదిస్తాం
– మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సహనం వందే, కరీంనగర్:
ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో శనివారం జరిగిన న్యాయవాదుల సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సహా కుహానా లౌకిక వాదులు ఎంత అడ్డుకున్నా బిల్లు ఆగదన్నారు.
దేశ ప్రజల ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. “ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్నాను. 109 కేసులు నాపై ఉన్నాయి. పలుమార్లు జైలుకు పోయాను. ప్రతిసారి నన్ను కాపాడుతోంది న్యాయవాదులే. వారి సంక్షేమం కోసం అన్ని విధాలా సహకరిస్తాను. న్యాయవాదుల కాన్ఫరెన్స్ కోసం సీఎస్సార్ ఫండ్స్ నుండి మరో రూ. 50 లక్షల సాయం చేసేందుకు నావంతు కృషి చేస్తాను” అని అన్నారు.