– కూతురు ప్రేమ వ్యవహారంతో రగిలిన తండ్రి
సహనం వందే, పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో ఓ పరువు హత్య గుండెలు పిండేసేలా చేసింది. కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఓ తండ్రి, యువకుడిని గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణం జరిగిన రోజే బాధితుడు పుట్టినరోజు హత్యకు గురి కావడం ఆవేదన కలిగిస్తుంది.
ప్రేమకు అడ్డంగా కులం…
ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. సాయికుమార్ను హెచ్చరించి, తన కూతురితో మాట్లాడొద్దని కఠినంగా చెప్పాడు. అయినా, ఇద్దరూ సంబంధాన్ని కొనసాగించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి, సాయిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
సంతోషం విషాదంగా మారిన క్షణం…
గురువారం రాత్రి 10 గంటల సమయంలో సాయికుమార్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు. అదే రోజు తన పుట్టినరోజు కావడంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో యువతి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా సాయిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిన సాయిని స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అతను ప్రాణాలు విడిచాడు. దీంతో సాయికుమార్ కుటుంబం కన్నీటిపర్యంతమైంది.