రచ్చ

  30 శాతం కమీషన్లపై రాష్ట్రవ్యాప్తంగా రచ్చ
– తెలంగాణలో కమీషన్ల దందాతో ప్రజాధనం లూటీ
– నేతల ఇళ్లల్లోనే కమీషన్ కౌంటర్లు… కొందరు కీలక ప్రజాప్రతినిధుల పోకడ
– జనం సొమ్ము మింగేస్తున్న పెద్దలు, కాంట్రాక్టర్లు
– కుటుంబ సభ్యులే ఈ కౌంటర్లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు
– ఆ కౌంటర్ల వద్ద కమీషన్లు ఇచ్చి టోకెన్ తీసుకున్న వాళ్లకే బిల్లులు క్లియర్
– గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వంలోనూ కమీషన్ల కక్కుర్తి

సహనం వందే, హైదరాబాద్
తెలంగాణలో కమీషన్ల వ్యవహారం అవినీతి రాజ్యంగా మారి, ప్రజాధనాన్ని దోచుకునే దారుణ పరిస్థితికి దారితీసింది. కొందరు కీలక ప్రజాప్రతినిధులు తమ ఇళ్లల్లోనే కమీషన్ల కౌంటర్లు ఏర్పాటు చేసి, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ “30% కమీషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్ అవుతాయి” అని ఆరోపించడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఈ అవినీతి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే కాదు, గత బీఆర్ఎస్ హయాంలోనూ కొనసాగిందని విమర్శలు వస్తున్నాయి. అధికార పెద్దలు, కాంట్రాక్టర్లు కలిసి ప్రజల సొమ్మును కొల్లగొడుతుండగా, ఈ దోపిడీపై ప్రజల ఆగ్రహం మిన్నంటుతోంది.

వందల కోట్ల అవినీతి…
కొందరు కీలక ప్రజాప్రతినిధులు తమ ఇళ్లల్లో ప్రత్యేక కమీషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి, అవినీతి దందాను నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కౌంటర్లను వారి కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నారని, కమీషన్ ఇచ్చి టోకెన్ తీసుకున్న కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు క్లియర్ అవుతున్నాయని సమాచారం. ఈ బహిరంగ దోపిడీ వల్ల ప్రభుత్వ పనుల్లో పారదర్శకత పూర్తిగా కనుమరుగైందని విమర్శలు వస్తున్నాయి. ఇలా వందల కోట్లు కమిషన్ల రూపంలో కాజేస్తున్నారు.

ఆర్థిక, పురపాలక, రోడ్లు-భవనాల శాఖల్లో…?
కేటీఆర్ ఆరోపణలతో 30% కమీషన్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పనుల బిల్లుల కోసం 20% నుంచి 30% కమీషన్ వసూలు చేస్తున్నారని, ఈ దందా ఆర్థిక, పురపాలక, రోడ్లు-భవనాల శాఖల్లో నిర్విఘ్నంగా సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన వారి నుంచి ఇప్పుడు మరింత అధిక కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ భారం తట్టుకోలేక కాంట్రాక్టర్లు పనులను అధిక ధరకు కోట్ చేస్తున్నారు. ఉదాహరణకు లక్ష రూపాయల పనిని లక్షన్నరకు టెండర్లు వేస్తున్నారు. రోడ్లు, వంతెనలు, భవన నిర్మాణాల వంటి ప్రాజెక్టుల ఖర్చు అసలు విలువ కంటే ఎక్కువగా చూపడంతో ఖజానా దిగజారుతోంది.

గతంలో కాళేశ్వరం మిషన్ భగీరథ…
ఈ కమీషన్ల అవినీతి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల సమయంలో 15-20% కమీషన్లు వసూలు చేసినట్లు అప్పటి విపక్షం కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు కేటీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నా, తమ హయాంలో వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడం విస్మయం కలిగిస్తుంది. “అధికారంలో ఎవరున్నా కమీషన్ల దందా ఆగడం లేదు” అని ప్రజలు మండిపడుతున్నారు.
కమీషన్ల దందాకు నిదర్శనలు…
– ఈనెల 7వ తేదీన సచివాలయంలోని ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ధర్నా చేసి, “20% కమీషన్ లేకుండా బిల్లులు క్లియర్ కావడం లేద”ని వారు  ఆరోపించారు.
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి “30% కమీషన్ లేనిదే పనులు జరగడం లేదు” అని చెప్పినట్లు కేటీఆర్ ఆరోపించారు.
– 2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్ చేసి, కమీషన్లు చెల్లించినట్లు అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి. కాళేశ్వరం కొన్ని పిల్లర్లు కుప్పకూలడంతో అవినీతి, కమీషన్లు నిజమేనని తేలిపోయింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *