వాటిని 153కి పెంచాలి… పార్లమెంటు స్థానాలను యథాతథంగా కొనసాగించాలి
– కేంద్రానికి విన్నవిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం
– పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర అభ్యంతరం
– దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ
– కేంద్ర ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తామని హెచ్చరిక
సహనం వందే, హైదరాబాద్
పార్లమెంటు స్థానాలను యధాతధంగా ఉంచాలని… అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు అసెంబ్లీలో గురువారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కి పెంచడం అత్యవసరం. ప్రజాస్వామ్యంలో సముచిత ప్రాతినిధ్యం దక్కేలా తాజా జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లను పెంచాల’ని అన్నారు. ‘రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు తక్షణమే రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నామ’ని సీఎం స్పష్టం చేశారు.
పార్లమెంటు సీట్లు యథాతథంగా ఉండాలి…
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని ఆయన చెప్పారు. ‘జనాభా నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. పార్లమెంటు సీట్లను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని మార్పులు చేయాల’ని ఆయన తెలిపారు.
డీలిమిటేషన్ ఈజ్ ‘లిమిటేషన్ ఫర్ సౌత్’…
‘కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపుపై చర్చ జరుపుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే, జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతింటుందని ఆనాడు ఇందిరా గాంధీ భావించారు. అందుకే చట్టాన్ని సవరించి పునర్విభజన చేశార’ని సీఎం గుర్తుచేశారు. ‘ఇప్పుడు మళ్లీ అదే అంశం చర్చకు రావడంతో దక్షిణాదిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కచ్చితంగా అమలు చేశాయి. కానీ, ఇప్పుడు జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయ’ని ఆయన హెచ్చరించారు.
డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్…
డీలిమిటేషన్తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి పడిపోతుంది.. ఇది దక్షిణాది ప్రజలకు అన్యాయంగా మారుతుంది. కేంద్రం ఈ పునర్విభజనను దక్షిణాదిపై నియంత్రణ సాధించేందుకు వినియోగించుకుంటోంది. ఇది అంగీకారయోగ్యం కాద’ని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘రాజకీయాలకు అతీతంగా దీనిపై ఒకే మాటపై నిలబడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అందుకే సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టాం. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మనపై వివక్ష చూపుతోంద’ని ఆయన విమర్శించారు.
కేంద్ర ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తాం…
‘2026 జనాభా లెక్కింపు తర్వాతే పునర్విభజన చేపడతామని పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కానీ, జమ్మూ కాశ్మీర్లో మాత్రం రాజ్యాంగాన్ని సవరించి 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90కి పెంచారు. సిక్కింలో కూడా 2018లో కేబినెట్లో తీర్మానం చేసి పునర్విభజన చేపట్టారు. అయితే, మన రాష్ట్రాలకు మాత్రం కేంద్రం వివక్ష చూపుతోంద’ని ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ప్రజల ముందుంచేందుకే ఈ తీర్మానం ప్రవేశపెట్టాం. దీనిపై రాజకీయాలకు అతీతంగా కేంద్రాన్ని సంప్రదిద్దాం. అవసరమైతే పోరాట బాట పడదామ’ని సీఎం పిలుపునిచ్చారు. ‘త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాన’ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.