– మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్370 ఎక్కడ?
సహనం వందే, హైదరాబాద్
మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్370 అదృశ్యం కావడం ఆధునిక ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 2014లో అదృశ్యమైన ఈ విమానం కోసం దశాబ్ద కాలం తర్వాత మళ్లీ కొత్తగా గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దశాబ్దం నుంచి అంతుచిక్కని రహస్యం…
2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయలుదేరిన ఎంహెచ్370 విమానం, టేకాఫ్ అయిన కొద్ది గంటల్లోనే రాడార్ నుంచి అదృశ్యమైంది. 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఉన్న ఈ బోయింగ్ 777 విమానం ఆచూకీ కోసం అంతర్జాతీయ స్థాయిలో భారీ గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం శూన్యం. సౌత్ చైనా సీలో మొదలైన ఈ గాలింపు చర్యలు, తర్వాత ఇండియన్ ఓషన్ వరకు విస్తరించాయి. అయినప్పటికీ, కేవలం కొన్ని శకలాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో ఈసారి ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ ఈ గాలింపు బాధ్యతను స్వీకరించింది. అత్యాధునిక అండర్వాటర్ రోబోటిక్స్ సాంకేతికతను ఉపయోగించి, ఇండియన్ ఓషన్లో 15,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సునిశితంగా గాలింపు చేపడుతోంది. “నో ఫైండ్, నో ఫీ” అనే ఒప్పందం ప్రకారం, విమాన శకలాలను కనుగొన్నట్లయితేనే మలేషియా ప్రభుత్వం ఈ సంస్థకు 70 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. ఈ గాలింపు కోసం నిపుణులతో కలిసి శాస్త్రీయ విశ్లేషణల ఆధారంగా ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది.
అంతర్జాతీయ ఒత్తిడి, కుటుంబాల ఆశలు…
ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది చైనాకు చెందినవారు. ఈ ఘటన తర్వాత చైనాలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. బీజింగ్లోని మలేషియా ఎంబసీ వద్ద కుటుంబ సభ్యులు సమాచారం కోసం ఆందోళనలు చేశారు. మళ్లీ గాలింపు చర్యలతో వారిలో ఆశలను రేకెత్తిస్తోంది. “ఈ రహస్యం వీడితే, మా కుటుంబాలకు శాంతి లభిస్తుంది” అని ఒక ప్రయాణికుడి కుటుంబ సభ్యుడు తెలిపారు.
అదృశ్యం గురించి ఎన్నో సిద్ధాంతాలు…
అదృశ్యం గురించి ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని మళ్లించి ఉండవచ్చని, లేదా హైజాకింగ్ జరిగి ఉండవచ్చని కొందరు ఊహిస్తున్నారు. అయితే, అధికారిక దర్యాప్తులో ఈ వాదనలను నిరూపించే ఆధారాలు లభ్యం కాలేదు. ఈ కొత్త గాలింపు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు.