మీ పాఠాలు మాకు అవసరం లేదు: స్టాలిన్

– యూపీ సీఎం యోగి వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటు ప్రతిస్పందన

సహనం వందే, చెన్నై
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తమిళనాడు ద్విభాషా విధానం, పార్లమెంటరీ స్థానాల పునర్విభజనపై తమ రాష్ట్రం అభిప్రాయాలను వ్యక్తం చేయడం బీజేపీకి నచ్చడం లేదని స్టాలిన్ అన్నారు. తమిళనాడు ఎప్పటినుంచో హిందీని తప్పనిసరి చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ‘మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు. కానీ భాషను బలవంతంగా రుద్దే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామ’ని స్టాలిన్ స్పష్టం చేశారు. త్రిభాషా విధానాన్ని తమ రాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారని ఆయన నొక్కి చెప్పారు.
పునర్విభజనపై ఆందోళన
పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తమిళనాడు తమ హక్కులను కాపాడుకోవడానికి దృఢంగా పోరాడుతోందని స్టాలిన్ తెలిపారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల దుమారం…
స్టాలిన్ వ్యాఖ్యలపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, “దేశాన్ని విభజించడానికి భాషా మరియు ప్రాంతీయ అంశాలను రాజకీయంగా వాడుతున్నారు” అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ఐక్యత కోసం కృషి చేస్తోందని, కానీ కొంతమంది నేతలు ప్రజలను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. యోగి వ్యాఖ్యలకు స్టాలిన్ తీవ్రంగా స్పందిస్తూ, ‘దురభిమాన రాజకీయాల గురించి మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరంలేద’ని విమర్శించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *