బెట్టింగ్ యాప్‌లపై సిట్

   అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
– బెట్టింగ్ యాప్ లు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
– ప్రభుత్వ బడుల్లో 6.50 లక్షలు తగ్గిన విద్యార్థులు
– విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం

సహనం వందే, హైదరాబాద్
తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శాసనసభ, మండలిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టాలను సవరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వ్యసనాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ బడుల్లో 6.50 లక్షలు తగ్గిన విద్యార్థులు…
రాష్ట్ర విద్యావ్యవస్థపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2021 నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మూడు, ఐదో తరగతి విద్యార్థుల్లో 75 శాతం మంది కనీస ప్రాథమిక సామర్థ్యాలు కూడా చూపలేకపోతున్నారని తెలిపారు. దేశంలోని 37 ర్యాంకుల్లో తెలంగాణ దాదాపు అన్ని సబ్జెక్టులలో 35, 36 ర్యాంకుల్లో ఉండటం విద్యా ప్రమాణాలు ఎంత దిగజారాయో తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో తరగతిలో ఉండి కనీసం రెండవ తరగతి పుస్తకాలు చదవగలిగిన విద్యార్థుల శాతం 2018లో 18.1% ఉండగా, 2024 నాటికి 6.3%కు పడిపోయిందని వెల్లడించారు. ఐదవ తరగతిలో ఈ శాతం 43.6% నుండి 31.5%కి తగ్గింది. గణితంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య 6.50 లక్షలు తగ్గడం, విద్యా ప్రమాణాలు పడిపోవడంపై ప్రభుత్వం మాత్రమే కాకుండా తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి సమగ్ర సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు. రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకుంటే ప్రక్షాళన సాధ్యం కాదని అన్నారు. సమాజ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యావ్యవస్థపై రాతపూర్వక సూచనలు ఇవ్వాలని సభ్యులను కోరిన ముఖ్యమంత్రి, అందరి సలహాలతో ఒక పాలసీ డాక్యుమెంట్ రూపొందిస్తామని, దానిపై చర్చలు జరుపుతామని చెప్పారు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. కేవలం నిధుల కేటాయింపు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని, సామాజిక బాధ్యతగా భావిస్తేనే మార్పు సాధ్యమని అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అవసరమైతే విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకుని పేదలకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *