– తమిళనాడులో తమిళం, ఇంగ్లీషే అధికార భాషలని స్పష్టీకరణ
సహనం వందే, చెన్నై:
“తమిళనాడుకు రెండు భాషలే చాలు” అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండించిన ఆయన, తమ రాష్ట్రం ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. తమిళ సంస్కృతి, భాషా హక్కులను కాపాడేందుకు త్వరలో కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు.
ద్విభాషా విధానమే కొనసాగుతుంది…
శాసనసభలో భాషా విధానంపై జరిగిన చర్చలో స్టాలిన్ మాట్లాడుతూ, “తమిళనాడులో తమిళం, ఆంగ్లం మాత్రమే అధికార భాషలు. మూడో భాషను తాము ఎప్పుడూ అంగీకరించం. ఇది మాకు భాషా గౌరవానికి సంబంధించిన విషయం” అని తేల్చిచెప్పారు.
1968లో అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై ప్రవేశపెట్టిన ద్విభాషా విధానాన్ని తమ ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తుందని స్టాలిన్ ప్రకటించారు. “మేము భాషలకు వ్యతిరేకం కాదు. కానీ మా సంస్కృతి, హక్కులను హింసించే భాషా బలవంతాన్ని సహించం” అని ఆయన స్పష్టం చేశారు.
హిందీకి ఆర్థిక ప్రోత్సాహం అర్ధరహితం…
హిందీ నేర్చుకున్నవారికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని ప్రకటించడాన్ని స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. “ఎన్ని వేల కోట్లు ఇచ్చినా, మేము మా భాషా విధానాన్ని మార్చం. ఇది కేవలం భాషా వివాదం కాదు, తమిళ యువత భవిష్యత్తు, రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం” అని స్పష్టం చేశారు. కేంద్రం భాషను ఆధిపత్య సాధనంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. “ఇది కేవలం భాష గురించి కాదు, రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు తమిళనాడు అన్ని చర్యలూ తీసుకుంటుంది” అని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో తమిళ భాషా హక్కులను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ చర్యలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు.