– మహిళల ‘ఛాతీని పట్టుకోవడం రేప్ కాద’న్న తీర్పు అమానవీయమంటూ వ్యాఖ్య
సహనం వందే, ఢిల్లీ:
మహిళల ఛాతీని పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సుప్రీం కోర్టు బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ తీర్పు అమానవీయంగా, సున్నితత్వం లేకుండా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. “నాలుగు నెలలు ఆలోచించి వెలువరించిన ఈ తీర్పులో సున్నితత్వం లోపించింది. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది” అని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పులోని 21, 24, 26 పేరాలలోని వ్యాఖ్యలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు హైకోర్టులోని సంబంధిత వర్గాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ఈ విషయంలో సహకరించాలని కోర్టు ఆదేశించింది.
అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే
అలహాబాద్ హైకోర్టులో పవన్, ఆకాశ్ అనే ఇద్దరు నిందితులపై అత్యాచార ఆరోపణలు నమోదయ్యాయి. 11 ఏళ్ల బాలిక ఛాతీని పట్టుకోవడం, ఆమె పైజామా తాడును తెంచడం, కల్వర్ట్ కిందకు లాగడానికి ప్రయత్నించడం వంటి ఆరోపణలు వారిపై ఉన్నాయి. అయితే, జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఈ చర్యలు అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కాదని తీర్పునిచ్చారు. ఇది మహిళలపై దాడి, బట్టలు ఊడదీయడం లేదా నగ్నంగా ఉండమని బలవంతం చేయడం వంటి నేరాల కిందకు వస్తుందని పేర్కొన్నారు. నిందితులపై పోక్సో చట్టం సెక్షన్లు 9/10 (తీవ్ర లైంగిక దాడి) కింద కేసు నమోదు చేయాలని, ఇవి తక్కువ శిక్షలు విధించే నేరాలని ఆదేశించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈనెల 24న ఈ తీర్పుపై పిల్ దాఖలైనా, మరో సుప్రీం కోర్టు బెంచ్ దానిని విచారణకు స్వీకరించలేదు. అయితే, ప్రజల ఆగ్రహాన్ని గమనించిన సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ఈ వివాదాస్పద ఉత్తర్వుపై స్టే విధించింది.