– న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు సవాల్
– కాంగ్రెస్ పన్ను మదింపు కేసులో తీర్పు వర్మదే
సహనం వందే, ఢిల్లీ:
హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు లభ్యం కావడం, ఆయన గత తీర్పులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో అవినీతి, అక్రమాలపై ప్రజల్లో నూతన సందేహాలను రేకెత్తిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు ఇప్పటికే వర్మ తీర్పులను సమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, దేశవ్యాప్తంగా మరిన్ని కీలక కేసుల తీర్పులపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నగదు లభ్యం, బదిలీ, విచారణ
ఈ నెల 14న న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో, అక్కడ భారీగా నగదు లభ్యమైంది. ఈ పరిణామంతో సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతేకాదు, ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణకు ఆదేశిస్తూ, సంబంధిత వీడియోలు, ఫొటోలు బహిరంగంగా విడుదల చేసింది. దీనితో, ఆయన గత తీర్పుల విశ్వసనీయతపై మరింత అనుమానాలు ముదిరాయి. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి వర్మ మార్చి 23న తన న్యాయ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
వివాదాస్పద తీర్పులు… సమీక్షకు డిమాండ్
యశ్వంత్ వర్మ గతంలో తీసుకున్న కొన్ని కీలక తీర్పులు ఇప్పుడు మరింత వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ పన్ను మదింపు కేసులో ఆయన తీర్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు, బంగారం దిగుమతిపై తీసుకున్న నిర్ణయం ఆర్థిక రంగంపై ప్రభావం చూపింది. ఆదాయపు పన్ను పునఃమదింపు కేసులో ఆయన తీర్పు చట్టపరమైన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా, సింభోలి షుగర్ మిల్స్ కేసులో ఆయన గత సంబంధం న్యాయవాదుల్లో తీవ్ర అభ్యంతరాలను రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితిలో, అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా పలు న్యాయ నిపుణులు న్యాయమూర్తి వర్మ ఇచ్చిన తీర్పులను సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో, గతంలో వివాదాస్పదంగా నిలిచిన మరికొన్ని తీర్పులపై కూడా సమీక్ష అవసరమని నిపుణులు భావిస్తున్నారు.
న్యాయ వ్యవస్థపై అనుమానాలు…
జస్టిస్ వర్మ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో అవినీతి, అక్రమాల గురించి కొత్త చర్చ ప్రారంభమైంది. ఒక్క వర్మ కేసు మాత్రమే కాకుండా, గతంలో వివాదాస్పదంగా నిలిచిన పలు తీర్పులపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, కీలకంగా మారిన కేసులను సమీక్షించేలా ప్రభుత్వం, సుప్రీంకోర్టు చొరవ చూపాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం కేవలం యశ్వంత్ వర్మ విషయంలోనే ముగియదని, దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ సమగ్రతను నిలబెట్టేందుకు సమీక్షలు మరింత కఠినతరం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిణామాలపై సుప్రీంకోర్టు తీసుకునే తదుపరి నిర్ణయాలు ఎంతో కీలకంగా మారనున్నాయి.