హైదరాబాద్‌లో ఇళ్ల క్రమబద్దీకరణ కుంభకోణం

   బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 58 పేరుతో వందల కోట్ల దోపిడీ
– పేదల ఆశలను అమ్ముకున్న రెవెన్యూ అధికారులు, దళారులు
– రెండేళ్లు కావస్తున్నా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్న మోసగాళ్లు
– వేల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట దోపిడి… రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్‌లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట జీవో నెంబర్ 58ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారు రెవెన్యూ అధికారులు, దళారులు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలకు న్యాయం చేయాల్సింది పోయి, అవినీతి అడ్డాగా మారి, వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. రెండేళ్లు గడుస్తున్నా “ఇదిగో-అదిగో” అంటూ మాయమాటలతో దాటవేస్తున్న ఈ మోసగాళ్లపై చర్యలు ఎక్కడ? కొందరికి క్రమబద్ధీకరణ జరిగిన, ఇంకా వేలాదిమంది అందుకోసం ఎదురు చూస్తున్నారు.

జీవో 58: ఆశా జ్యోతి కాదు… అవినీతి ఆయుధం
తెలంగాణ ప్రభుత్వం 2014లో జారీ చేసిన జీవో నెంబర్ 58 లక్ష్యం పేదలు ఆక్రమించిన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించి, 125 గజాల వరకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులకు ఇది ఒక వరంగా భావించారు. కానీ, ఈ జీవో అమలు పేరుతో అధికారులు, దళారులు కలిసి పేదల రక్తం పీల్చే దందాగా మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు దోచుకున్న ఈ కుంభకోణం బయటపడుతోంది. జీవో 58 అవినీతి పరులకు ఆయుధమైంది.

పేదల జీవితాలతో ఆటలు…
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జీవో 58 కింద 26,092 దరఖాస్తులు, జీవో 59 కింద 15,200 దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 41,292 దరఖాస్తులు వచ్చినా, క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇప్పటికీ అరకొరగానే ఉంది. ఈ జిల్లాలోనే రూ. 100 కోట్లు దళారులు, రెవెన్యూ అధికారులు పేదల నుంచి కొల్లగొట్టారన్న విమర్శలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే దోపిడీ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్ వందల కోట్లలో ఉంటుందని అంచనా. పేదలు తమ ఇళ్లను క్రమబద్ధీకరించుకోవాలని రూ. 10,000 నుంచి లక్ష వరకు లంచాలు చెల్లించారు. అప్పులు చేసి, కష్టపడి సేకరించిన డబ్బును అధికారుల చేతిలో పెట్టినా, పట్టాలు రాక బాధితులు నిరాశలో మునిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు “త్వరలో పట్టాలు ఇస్తాం” అని హామీలు ఇచ్చిన అధికారులు, దళారులు ఇప్పుడు నోరు మూసుకున్నారు.

రియల్ ఎస్టేట్ మాఫియా పాత్ర..‌
పేదల ఆశలను అడ్డం పెట్టుకుని, రెవెన్యూ అధికారులు దళారులతో కలిసి లంచాల దందా నడిపారు. హైదరాబాద్‌లోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో “పట్టాలు ఇప్పిస్తాం” అని మోసం చేసి, కోట్ల రూపాయలు వసూలు చేశారు. జీవో 58 ప్రకారం పట్టాలు మంజూరు కావాల్సి ఉంది కానీ, వేలాది మంది పేదలు ఇప్పటికీ ప్రామాణిక పత్రాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ పథకాన్ని దుర్వినియోగం చేసి, అర్హత లేని వ్యక్తులు, రియల్ ఎస్టేట్ మాఫియా కూడా లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది?
న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవినీతిపై దర్యాప్తు ఎందుకు చేయడం లేదు? అక్రమంగా వసూలు చేసిన కోట్ల రూపాయలను పేదలకు తిరిగి ఇప్పించే బాధ్యత ఎవరిది? జీవో 58 ప్రకారం అర్హులైన వారికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “అప్పులు చేసి డబ్బు ఇచ్చాం, కానీ మాకు న్యాయం జరగలేదు” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఈ అవినీతి గొలుసును తెంచకపోతే, జీవో 58 కేవలం ఒక కుంభకోణంగా చరిత్రలో నిలిచిపోతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *