మేడ్చల్ లో రైలు కిందపడి ఆత్మహత్య
– సినీ తారలపై దర్యాప్తు బిగుస్తున్న ఉచ్చు…
– 19 కంపెనీలపై కేసులు… కోర్టులో సవాల్
సహనం వందే, హైదరాబాద్:
క్రికెట్ బెట్టింగ్ అనే పిశాచం యువత జీవితాలను బలితీసుకుంటోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ (24), రూ. 2 లక్షలు కోల్పోయి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో చివరి కాల్లో తన తీవ్ర ఒత్తిడిని బయటపెట్టి, రైలు ట్రాక్ వద్ద లొకేషన్ షేర్ చేశాడు. స్నేహితులు కుటుంబ సభ్యులు వెళ్లేసరికి అప్పటికే రైలు పట్టాల మీద శవమై తేలాడు.
బెట్టింగ్తో అంధకార జీవనం…
తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించాలనే దురాశతో బెట్టింగ్లోకి దిగిన యువత, తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. క్రీడా వినోదంగా ఉండాల్సిన క్రికెట్, ఇప్పుడు మరణ మార్గంగా మారింది.
ఉరుముతున్న చట్టం: సెలెబ్రిటీలకు చుక్కలు!
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై చట్టం కత్తి దూస్తోంది! హైకోర్టు న్యాయవాది కృష్ణ కాంత్, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)కు ఫిర్యాదు చేయడంతో యుద్ధం మొదలైంది. ఈ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలపై రూ. 50 లక్షల జరిమానా, మూడేళ్ల నిషేధం విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సినీ తారలపై దర్యాప్తు బిగుస్తున్న ఉచ్చు…
బెట్టింగ్ యాప్స్పై పోలీసులు దూకుడు పెంచారు. మియాపూర్ పోలీసులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మితో సహా రీతూ చౌదరి, టేస్టీ తేజ వంటి ఇన్ఫ్లుయెన్సర్లను లక్ష్యంగా చేసుకున్నారు. వీరి స్టేట్మెంట్లు రికార్డు చేసి, నిజాలను బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నారు.
19 కంపెనీలపై కేసులు: కోర్టులో సవాల్
పోలీసులు 19 బెట్టింగ్ కంపెనీలను గుర్తించి, కేసులు నమోదు చేసి కోర్టుకెక్కారు. ఆఫీస్లను ట్రాక్ చేసి, నిర్వాహకులను కొత్త సెక్షన్ల కింద బంధించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు.