ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గు

   పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధికం  
– ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ

సహనం వందే, విజయవాడ:
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో లీటరు పెట్రోల్ ధర రూ. 109.60 కాగా, డీజిల్ ధర రూ. 97.47గా ఉంది. తమిళనాడులో పెట్రోల్ ధర రూ. 100.86, డీజిల్ ధర రూ. 92.39గా ఉంది. కర్ణాటకలో పెట్రోల్ ధర రూ. 102.90, డీజిల్ ధర రూ. 88.99గా ఉంది. తెలంగాణలో పెట్రోల్ ధర రూ. 107.46, డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ పై రూ. 3 నుండి రూ. 9 వరకు, డీజిల్ పై రూ. 5 నుండి రూ. 9 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని షర్మిల రెడ్డి తెలిపారు.

టీడీపీ, వైసీపీలపై విమర్శలు…
పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారపక్షంలో మరో మాట మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆమె అన్నారు. గత 10 ఏళ్లుగా ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని, వ్యాట్ పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపాయని షర్మిల రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు రూ. 20 వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూలు చేశారని, జగన్ మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో రూ. 25 వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూలు చేశారని ఆమె తెలిపారు.
హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్
పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని నిలబెట్టుకోవాలని షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు. లీటరుకు రూ. 17 తగ్గించి, ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆమె కోరారు.
ప్రజలపై పన్నుల భారం…
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే పన్నులు తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *