– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున న్యాయవాది ఇజ్రాయిల్ హత్య, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సూర్యాపేటలో కృష్ణ అనే యువకుడిని, ఇబ్రహీంపట్నం సమీప గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న కానిస్టేబుల్ ను హత్య చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నప్పటికీ, ఇలాంటి హత్యలు, అరాచకాలు, కామాంధుల దౌర్జన్యాలను అరికట్టడంలో పోలీసు యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజల మాన, ప్రాణాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.