రెండేళ్లు జొన్నలు అమ్మని ఫలితంగా రూ. 130 కోట్లు నష్టం
– రెండేళ్ల కాలంలో గోదాముల్లో పాడైపోయిన తెల్ల జొన్నలు… అధికారుల నిర్లక్ష్యమే
– ఇప్పుడు టెండర్లు పిలవడంతో తక్కువకు కోట్
– కాంట్రాక్టర్ల సిండికేట్… కొందరు అధికారుల సపోర్ట్
సహనం వందే, హైదరాబాద్:
రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి కొన్న తెల్ల జొన్నలు గోదాముల్లో పుచ్చిపోయేలా వదిలేసిన మార్క్ఫెడ్, ఇప్పుడు కాంట్రాక్టర్లకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023-24 యాసంగి సీజన్లో లక్ష మెట్రిక్ టన్నుల జొన్నలను క్వింటాలుకు రూ.3,180 చొప్పున రూ.318 కోట్లతో కొనుగోలు చేసిన ఈ సంస్థ, వాటిని సకాలంలో విక్రయించకుండా గోదాముల్లో రెండేళ్లపాటు నిల్వ చేసింది. దుమ్ము, దూళి, పిండిలా మారిన ఈ జొన్నలు అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతున్నాయి. అసలు రెండేళ్లు అమ్మకుండా ఎందుకు వదిలేశారు? జొన్నలు పాడవుతాయని తెలియని అవివేకమా ఇది?
తక్కువ ధరకు కాంట్రాక్టర్ల చేతుల్లోకి: రూ.130 కోట్ల నష్టం
ప్రస్తుత మార్కెట్ ధర క్వింటాలుకు రూ.2,300-2,400, ఎమ్మెస్పీ రూ.3,371 ఉండగా, మార్క్ఫెడ్ కాంట్రాక్టర్లు ఈ పాడైన జొన్నలను క్వింటాలుకు రూ.1,850కి కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. రూ.3,180కి కొని, రూ.1,850కి అమ్మితే క్వింటాలుకు రూ.1,330 నష్టం, లక్ష టన్నులకు రూ.130 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. ఈ భారీ నష్టంతో మార్క్ఫెడ్ సంస్థ ఆర్థికంగా కుదేలవుతోంది. ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? ఈ నష్టానికి బాధ్యులెవరు? అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కమీషన్ల కోసం సిండికేట్తో దొంగాట…
కొన్ని ఏజెన్సీలు సిండికేట్గా మారి, పోటీ లేకుండా ధరలను నియంత్రిస్తున్నాయి. మూడు నెలల క్రితం రూ.1,870 బిడ్ వచ్చినప్పుడు రద్దు చేసిన అధికారులు, ఇప్పుడు రూ.1,850కి ఒప్పుకోవడం వెనుక కుట్ర సుస్పష్టం. తక్కువ ధరకు అమ్మి, మధ్యలో కమీషన్లు దండుకునే పనిలో అధికారులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సిండికేట్ వెనుక ఎవరి హస్తం ఉంది? అధికారుల జేబుల్లోకి ఎంత డబ్బు వెళ్లిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దుర్మార్గంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.
అప్పుల్లో మార్క్ఫెడ్…
మార్క్ఫెడ్ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో, బ్యాంకు గ్యారెంటీలతో అప్పులు తెచ్చి రైతులకు చెల్లింపులు చేస్తోంది. అప్పుల్లో ఉన్న సంస్థను మరింత నష్టంలోకి నెట్టి, అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
బాధ్యులపై చర్యలు ఎప్పుడు?
రెండేళ్లు జొన్నలను అమ్మకుండా పుచ్చిపోయేలా చేసి, తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం ద్వారా కొందరు మార్క్ఫెడ్ అధికారులు ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నష్టానికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది? రైతుల కష్టార్జితాన్ని కాపాడే బదులు కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టే ఈ వ్యవహారం ఎంతకాలం కొనసాగుతుంది?