– ప్రభుత్వానికి జగన్ విజ్ఞప్తి
సహనం వందే, అమరావతి:
ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన.. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షం, వడగళ్ల, గాలికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పార్ణపల్లె, ఏగువపల్లె, కోమటీనూతల, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో 4000 ఎకరాల్లో వర్షానికి అరటి పంటలు దెబ్బతిన్నాయి.. దాదాపుగా రైతన్నలు 15 లక్షలు చొప్పున నష్ట పోయారని పేర్కొన్నారు. అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు. 2023– 24 కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పుణ్యాన ఖరీఫ్ లో పంట నష్టం చూశాం.. వెంటనే ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని.. వర్షం వల్ల నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని.. రైతు భరోసా కింద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సున్నా వడ్డీని ఎత్తేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పులివెందుల అరటి సాగుకు నెంబర్ వన్. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ మా ప్రభుత్వంలో నిర్మించాం.. కానీ, యూజర్ ఏజెన్సీని ఎంపిక చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు.. మిర్చి, శనగలు, మినుములు.. ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని విమర్శించారు.. 4000 ఎకరాల అరటి రైతులకు మేం అండగా ఉంటామని హామీ ఇస్తున్నా.. ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తా అన్నారు వైఎస్ జగన్.