అవయవ మార్పిడిలో కొత్త శకం!

మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం అమలు
– బ్రెయిన్ డెత్ నిర్ధారణకు మరికొందరు స్పెషలిస్టులు…
– తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… అక్రమాలకు చెక్

సహనం వందే, హైదరాబాద్:
1994లో ఆమోదించిన మానవ అవయవాల మార్పిడి చట్టానికి 2011లో సవరణలు చేసి, దాన్ని మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం (తోట)గా రూపొందించారు. ఈ చట్టం అవయవాలతో పాటు కణజాలాల మార్పిడిని చట్టబద్ధం చేసింది. 2014లో కేంద్రం విడుదల చేసిన నిబంధనలతో దేశంలో 24 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా తోట చట్టాన్ని అనుసరించేందుకు సిద్ధమైంది. ఈ చట్టం అమలు వల్ల అవయవ దానం, మార్పిడి వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరిగి, అవసరమైన వారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుంది.
గుండె, చర్మం మార్పిడి సాధ్యం…
తోట చట్టం అమలు ద్వారా గుండె, కిడ్నీ, కాలేయంతో పాటు చర్మం, ఎముక మజ్జ, రక్త నాళాలు, గుండె కవాటాల మార్పిడి చట్టబద్ధమవుతుంది. బ్రెయిన్ డెత్ సంభవించిన దాతల నుంచి ఈ అవయవాలను సేకరించి, అవసరమైన రోగులకు అమర్చడం సులభమవుతుంది. ఇది వైద్య రంగంలో కీలక మార్పును తెస్తుంది. అలాగే, తాతలు, అమ్మమ్మలు తమ మనవళ్లు, మనవరాళ్లకు, అలాగే మనవళ్లు తమ తాతలకు అవయవ దానం చేసేందుకు అనుమతి లభిస్తుంది. జన్యుపరమైన సమస్యల వల్ల కాలేయ మార్పిడి అవసరమైన పిల్లల ప్రాణాలను కాపాడడంలో ఈ నిబంధన ఎంతగానో ఉపయోగపడుతుంది.
అక్రమాలపై కోటి జరిమానా, 10 ఏళ్ల జైలు…
తోట చట్టం అవయవాల అక్రమ రవాణా, మార్పిడిలను కట్టడి చేసేందుకు కఠిన శిక్షలను విధిస్తుంది. గతంలో ఉల్లంఘనలకు గరిష్టంగా రూ.5,000 జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండగా, కొత్త నిబంధనలు రూ.1 కోటి వరకు జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్షను అమలు చేస్తాయి. ఈ కఠిన చర్యలు అవయవ వ్యాపారాన్ని అరికట్టి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తాయి.
బ్రెయిన్ డెత్ నిర్ధారణకు మరికొందరు స్పెషలిస్టులు…
1995 నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెత్ నిర్ధారణకు మెదడు శస్త్రవైద్యులు, మెదడు వైద్య నిపుణులకు మాత్రమే అధికారం ఉండేది. కొత్త నిబంధనలతో సాధారణ వైద్యులు, శస్త్రవైద్యులు, తీవ్ర సంరక్షణ నిపుణులు, మత్తు వైద్యులు కూడా ఈ అధికారాన్ని పొందుతారు. దీనివల్ల బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలు వృథా కాకుండా, అవసరమైన రోగుల ప్రాణాలను కాపాడే అవకాశం పెరుగుతుంది.

సలహా సంఘాలు, కేంద్రాల ఏర్పాటు…
తోట చట్టం అమలులో అవయవ దానం, మార్పిడి ప్రక్రియలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ స్థాయిలో సలహా సంఘం ఏర్పాటవుతుంది. జీవన్‌దాన్‌ను కేంద్రం, ఇతర రాష్ట్రాల అవయవ మార్పిడి వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. ఇతర రాష్ట్రాల మెదడు మరణ దాతల నుంచి అవయవాలను తెలంగాణ రోగులకు అమర్చే అవకాశం కలుగుతుంది. ప్రతి ఆసుపత్రిలో మార్పిడి సమన్వయకర్తల నియామకం, అవయవ సేకరణ, నిల్వ కేంద్రాల ఏర్పాటు ద్వారా పారదర్శకత పెరుగుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *