డబ్బు కోసం గడ్డి

సినీ తారలు, సెలబ్రిటీల పోకడ
– బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో బాధ్యతారాహిత్యం
– ఫలితంగా అనేకమంది యువత ఆత్మహత్య
– గుట్కాలు, మద్యం బ్రాండ్లకు కూడా సినిమా తారల ప్రచారంపై విమర్శలు

సహనం వందే, హైదరాబాద్
సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వీళ్లంటే సామాన్యులకు ఎంతో అభిమానం. తెరపై కనిపించే హీరోలను ఆదర్శంగా తీసుకుని పాటించేవారు అనేకమంది ఉంటున్నారు. అయితే డబ్బుల కోసమో, మరే ఇతర కారణాల వల్లో సెలబ్రిటీలు చేసే తప్పుడు వాణిజ్య ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. సినిమాల్లో పెద్ద పెద్ద నీతులు చెప్పే హీరోలు, బయట మాత్రం డబ్బులకు కక్కుర్తిపడుతూ ప్రజలను నిండా ముంచుతున్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు గాను పలువురు సినీ తారలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్‌లతో యువత జీవితాలను బలితీస్తున్న సెలబ్రిటీలు…
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ యాప్‌ల వల్ల ఎందరో యువతీ యువకులు ఆర్థికంగా నష్టపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి, చివరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణలో గత ఏడాదిలో బెట్టింగ్ యాప్‌ల వల్ల 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య అధికంగా ఉంటుందని అంచనా. హైదరాబాద్‌లో ఓ యువకుడు బెట్టింగ్‌లో రూ. 50 లక్షలు పోగొట్టుకుని, అప్పుల భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డిలో సంజీవ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెట్టింగ్‌లో నష్టపోయి, కుటుంబాన్ని వదిలి జీవితాన్ని ముగించాడు. ఇలాంటి ఘటనలు అనేకచోట్ల కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి సినీ తారలు, ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రమోషన్లు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. పోలీసులు ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన వారిలో ప్రముఖ తెలుగు సినీ తారలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. వీరిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్ (పరేషాన్ బాయ్స్), కిరణ్ గౌడ్, సుప్రీత, సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ వంటి పేర్లు ఉన్నాయి. మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌లపై కూడా ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఈ సెలబ్రిటీలు “రండి, ఆడండి, గెలవండి” అంటూ యువతను ఆకర్షించి, వారిని బెట్టింగ్ ఊబిలోకి లాగారు. ఫలితం? ఆస్తులు, పరువు కోల్పోయి, కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
గుట్కా ప్రకటనలతో ఆరోగ్యాన్ని బలిచేస్తున్న బాలీవుడ్ స్టార్లు…
బెట్టింగ్ యాప్‌లతో పాటు, గుట్కా వంటి హానికర ఉత్పత్తులకు కూడా ప్రముఖ సెలబ్రిటీలు ప్రకటనలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్లైన అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి వారు విమల్, పాన్ బహార్ వంటి గుట్కా బ్రాండ్లకు ప్రచారం చేశారు. ఈ ఉత్పత్తులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని తెలిసినా, కోట్ల రూపాయల కోసం వీరు ఈ ప్రకటనల్లో నటించారు. యువత వీరిని ఆదర్శంగా తీసుకుని గుట్కా వాడకం పెరిగితే, దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు?

రియల్ ఎస్టేట్ మోసాలలోనూ…
గతంలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రకటనలు ఇచ్చిన సెలబ్రిటీలు కూడా సామాన్యులను మోసం చేసే వ్యవహారంలో భాగమయ్యారు. ఉదాహరణకు, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్లు వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ప్రచారం చేశారు. ఈ కంపెనీలు ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ తర్వాత మాయమైన సందర్భాలు లెక్కలేనన్ని. తెలుగు రాష్ట్రాల్లోనూ చిట్‌ఫండ్ కంపెనీలకు సినీ తారలు ప్రచారం చేసి, లక్షల మంది పొదుపు సొమ్మును గాలికి వదిలేశారు.
సమాజ బాధ్యతను విస్మరించిన సెలబ్రిటీలు…
ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీల్లో సామాజిక బాధ్యత ఎంత తక్కువగా ఉందో తెలియజేస్తాయి. డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఈ స్టార్లు, తమ ప్రభావం యువతపై ఎలాంటి పరిణామాలను చూపుతుందో ఆలోచించరు. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆత్మహత్యలు, గుట్కా వల్ల ఆరోగ్య నష్టం, రియల్ ఎస్టేట్ మోసాల వల్ల ఆర్థిక దెబ్బ—ఇవన్నీ సెలబ్రిటీల నీతిలేని వ్యాపార ప్రకటనల ఫలితమే. సమాజాన్ని ఉద్ధరించాల్సిన సెలబ్రిటీలు, దాన్ని నాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరి కక్కుర్తి, లాభాపేక్ష సమాజానికి శాపంగా మారింది. ప్రభుత్వాలు, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఈ స్టార్ల మనస్తత్వం మారకపోతే ఈ విషచక్రం ఆగదు. సెలబ్రిటీలు తమ ప్రభావాన్ని సానుకూలంగా వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే వీరు సమాజానికి శత్రువులుగానే మిగిలిపోతారు.
బెట్టింగ్ యాప్‌ల పీడ విరగడెలా?
* బెట్టింగ్ యాప్‌లపై కఠినమైన చట్టాలు తీసుకురావాలి.
* ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపట్టాలి.
* బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసే సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలి.
* బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేయాలి.
* బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.
* ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిఘా పెంచాలి.
* ఇంటర్నెట్ ప్రొవైడర్లు బెట్టింగ్ యాప్‌లను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకోవాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *