కాంగ్రెస్, బీఆర్ఎస్ల నిజస్వరూపం బహిర్గతం
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపణ
సహనం వందే, హైదరాబాద్:
డీలిమిటేషన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వారి అవకాశవాద రాజకీయాలను బట్టబయలు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ లేదా కేబినెట్లో ఎటువంటి చర్చ జరగనప్పటికీ, ఈ పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని బురద జల్లుతున్నాయన్నారు.
జనాభా లెక్కల సేకరణ ఇంకా ప్రారంభం కాలే…
చెన్నైలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వారి కుట్రను స్పష్టం చేస్తోందని ఆయన విమర్శించారు. జనాభా లెక్కల సేకరణ ఇంకా ప్రారంభం కానప్పుడు, డీలిమిటేషన్పై నిర్ణయం ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చిగురిస్తున్న వ్యతిరేకతను మభ్యపెట్టేందుకు ఈ దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.
దక్షిణాది సంక్షేమం కోసం కేంద్రం…
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రాష్ట్రాల మధ్య వివక్ష లేకుండా అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, ప్రపంచ దేశాలతో సమానంగా పోటీపడే స్థాయికి తీసుకొచ్చిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం…
తెలంగాణ, కర్ణాటకలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, తమిళనాడులో పట్టు బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే కుట్రతో కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు ఐక్యమై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్లు ఈ అంశంపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ, వారు ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.
డీలిమిటేషన్ చట్టాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి…
డీలిమిటేషన్కు సంబంధించి చట్టాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని, ఇప్పుడు అదే పార్టీ తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. జనాభా లెక్కల సేకరణ, పార్లమెంట్ చర్చ లేకుండా డీలిమిటేషన్ సాధ్యం కాదని, ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని వివరించారు. దక్షిణాది ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.