వడగళ్ల వర్షంతో 11 వేల ఎకరాల్లో పంట నష్టం

– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:
రెండు రోజులుగా తెలంగాణలో వడగళ్ల వర్షం, ఈదురు గాలుల వల్ల తెలంగాణలో 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఏకకాలంలో రుణమాఫీ చేశాం…
ఆర్థిక అస్తవ్యస్తత ఉన్నప్పటికీ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి, రూ. 20,616.89 కోట్లతో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను చేశామని తుమ్మల అన్నారు. మొదటి మూడు విడతల్లో లబ్ధి పొందని 3,13,896 మంది రైతుల కోసం ఇంటింటికీ సమాచారం సేకరించి, రూ. 2747.67 కోట్లు మాఫీ చేసినట్లు వివరించారు.
బీఆర్ఎస్ విమర్శలపై ఖండన…
బీఆర్ఎస్ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, 2014లో లక్ష రుణమాఫీ హామీని నాలుగేళ్లు ఆలస్యం చేసి, రైతులపై రూ. 2630 కోట్ల వడ్డీ భారం మోపారని తుమ్మల గుర్తు చేశారు. 2018లో రూ. 11,909.31 కోట్ల రుణమాఫీలో రూ. 8515 కోట్లు వడ్డీకే సరిపోయి, రైతులకు ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు.
రైతులకు ఆదర్శ పథకాలు…
గత ప్రభుత్వం రెండుసార్లు ప్రణాళిక లేని రుణమాఫీతో విఫలమైతే, 2024లో తమ రుణమాఫీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తుమ్మల పేర్కొన్నారు. రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, వ్యవసాయ యాంత్రీకరణ, ఇందిరమ్మ భరోసా, పంట నష్టపరిహారంలో రూ. 10,000 సాయం, ఫసల్ భీమా యోజన పునరుద్ధరణతో రైతులకు అండగా నిలిచామని తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *