దక్షిణాదిపై ఢిల్లీ కుట్ర…

  డీలిమిటేషన్ పేరుతో పెను విధ్వంసం..
– చెన్నైలో కేటీఆర్ సంచలన ఆరోపణలు!

సహనం వందే, హైదరాబాద్
చెన్నై వేదికగా జరిగిన డీలిమిటేషన్ సదస్సులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై ఢిల్లీ కుట్ర పన్నుతోందని, ఇది కేవలం పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితం కాదని, ఆర్థిక విధ్వంసానికి కూడా దారితీస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం చేసే ఈ డీలిమిటేషన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో మరింత అన్యాయం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల ప్రాతినిధ్యం, ప్రభుత్వాలతో సంబంధాలు మెరుగుపరచడం పేరుతో రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ విధానానికి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లు పెంచితే పాలన ప్రజలకు చేరువవుతుందని, పార్లమెంటు సీట్లను యథాతథంగా ఉంచి అసెంబ్లీ సీట్లు పెంచాలని కేటీఆర్ సూచించారు. దేశ జీడీపీలో 36 శాతం వాటా కలిగి ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో 36 శాతం సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభాతో పాటు ఆర్థిక, పరిపాలన అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
దేశాభివృద్ధిలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్ విధానం ఉందని కేటీఆర్ విమర్శించారు. ఈ విధానం వల్ల వెనుకబడిన రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వివక్షను మానుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, లేకపోతే దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే కుట్రలను తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *