రైతులకు 24 గంటల్లోనే నగదు జమ: మంత్రి నాదెండ్ల మనోహర్

సహనం వందే, గుంటూరు
ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రైతులు పండించిన ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గత ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో అనేక ఇబ్బందులు సృష్టించిందని, ఈసారి రైతుల సౌకర్యార్థం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేశామని ఆయన తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అంతేకాకుండా, 17-20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఏఐ ద్వారా ధాన్యం అమ్మకాలు జరుపుకునేలా సేవలను సులభతరం చేశామని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *