రాష్ట్రవ్యాప్తంగా ‘దావత్ ఏ ఇఫ్తార్’

ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

సహనం వందే, హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ‘దావత్ ఏ ఇఫ్తార్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఆహార నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు రాజీ పడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ఏర్పాట్లలో ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా, చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. శాంతి భద్రతలు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు. ఏర్పాట్లకు సంబంధించిన రోజువారీ సమీక్షను ప్రభుత్వ సలహాదారు, ఏర్పాట్ల కమిటీ వైస్ చైర్మన్ షబ్బీర్ అలీ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ‘దావత్ ఏ ఇఫ్తార్’ కార్యక్రమానికి కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రభుత్వం ‘దావత్ ఏ ఇఫ్తార్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *