సహనం వందే, హైదరాబాద్
హైదరాబాద్: డిజిపి కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.ఎం. నందీశ్వర బాబ్జీ శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం 4:40 గంటల సమయంలో హనుమాన్ ఆలయం సమీపంలోని లక్ష్మారెడ్డి పల్లెంలో నందీశ్వర బాబ్జీ నడకకు వెళ్లి రోడ్డు దాటుతుండగా, అబ్దుల్లాపూర్మెట్ నుండి హయత్ నగర్ వైపు వేగంగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్, నందీశ్వర బాబ్జీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. నందీశ్వర బాబ్జీ మరణం బాధాకరమని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీఎస్పీగా పనిచేసి, పదోన్నతిపై డిజిపి కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన ఎన్నో ఏళ్లు నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించారని సుధీర్ బాబు కొనియాడారు. ఆయన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వాకింగ్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం – అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి
