సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని, సూక్ష్మ సేద్యానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, సహకార సంఘాలను బలోపేతం చేయాలని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకం రూపొందించాలని, ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యం పెంచేందుకు సహకరించాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు పథకాల నిధులను మార్చి 31లోగా వినియోగించాలని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నాబార్డు పరిధిలోని పథకాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని, స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్ల నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని, కొత్త గ్రామ పంచాయతీలకు గ్రామీణ అనుసంధానం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నాబార్డు చైర్మన్ను కోరారు. నాబార్డు చైర్మన్ షాజీ కేవీ, కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు.
నాబార్డు చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
