సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడం, వైద్య సిబ్బంది నియామకం, డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి అంశాలపై గురువారం మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండింగ్…
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. “అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా హెచ్ఆర్, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రగ్స్, శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి” అని ఆయన సూచించారు.
డయాగ్నస్టిక్ సేవలు, నిధుల కేటాయింపు...
పేద ప్రజలకు అన్ని రకాల డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. “టూల్స్ అండ్ ప్లాంట్స్ నిర్వహణ కోసం అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు నిధులు కేటాయించాలి” అని ఆయన ఆదేశించారు.
జవాబుదారీతనం, సిబ్బంది నియామకం:
ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఆసుపత్రి సూపరింటెండెంట్లపై ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. “అన్ని ఆసుపత్రుల్లో సరిపడా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని త్వరలోనే నియమిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.
వైద్య విధాన పరిషత్ మార్పు…
వైద్య విధాన పరిషత్ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మారుస్తామని మంత్రి తెలిపారు. “ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పల్లె దవాఖాన, పట్టణ దవాఖాన, పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నిర్ధారించిన అన్ని రకాల వైద్య సేవలు విధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం” అని ఆయన చెప్పారు.
జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు:
జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 90 శాతం వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. “రిఫరల్ సిస్టమ్ ద్వారానే టీచింగ్ హాస్పిటళ్లకు పేషెంట్లను అనుమతించడం ద్వారా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తాం” అని ఆయన వివరించారు.
డ్యూటీ హవర్స్లో డాక్టర్లు తప్పనిసరి…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీ హవర్స్లో డాక్టర్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ప్రణాళిక – మంత్రి దామోదర రాజనర్సింహ
