హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీల ప్రీ-ఈవెంట్

యాదగిరిగుట్ట ఆలయం అనుభూతి ఇచ్చిందన్న 2024 ప్రపంచ సుందరి
– మే నెలలో మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అద్వితీయ ఆతిథ్యం!

సహనం వందే, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గురువారం ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యాటక అందాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన నుంచి వచ్చిన ఈ కార్యక్రమం తెలంగాణ జానపద కళలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది” అని ఆయన చెప్పారు.
మహిళా సాధికారతకు ప్రతీకగా మిస్ వరల్డ్ పోటీలు:
మిస్ వరల్డ్ పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలని మంత్రి సూచించారు. “సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పది. ఈ పోటీల ద్వారా తెలంగాణకు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థిక వృద్ధి కూడా సాధిస్తాం” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజకీయ విమర్శలకు తావులేదు:
మిస్ వరల్డ్ పోటీలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని మంత్రి హితవు పలికారు. “ఇది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే మంచి అవకాశం. 140 దేశాల వారు ఇక్కడికి వస్తారు. ప్రపంచం దృష్టి తెలంగాణపై పడుతుంది” అని ఆయన అన్నారు.

ప్రపంచ సుందరి ప్రశంసలు
2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. “భారతదేశ సంస్కృతి, కళలు గొప్పగా ఉన్నాయి. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించడం మంచి అనుభూతినిచ్చింది” అని ఆమె అన్నారు.

తెలంగాణ గొప్పదనం…
తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యత కలిగి ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. “యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వేయి స్తంభాల గుడి, గోల్కొండ, చార్మినార్ వంటి గొప్ప కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. మే నెలలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహిస్తాం” అని ఆమె చెప్పారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *