సహనం వందే, హైదరాబాద్:
ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య ప్రకటన విడుదల చేశారు. వివిధ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. “వైస్ ఛాన్సలర్ చేత ఇలాంటి సర్క్యులర్ ఇప్పించింది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలకు నిదర్శనం” అని వీరయ్య ఆరోపించారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏమైంది?
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రగతి భవన్ ముందు ముళ్ల కంచెలు ధ్వంసం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని రేవంత్ రెడ్డి చెప్పారని వీరయ్య గుర్తు చేశారు. “మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నదేమిటి? జవహర్ లాల్ నెహ్రూ చెప్పిన మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోయిందా? యూనివర్సిటీ కేంద్రాలు భావ సంఘర్షణ కేంద్రాలుగా విరసిల్లాలని ఆయన చెప్పారు. కానీ, ఈరోజు కనీస ప్రజాస్వామ్య విలువలకు కూడా అవకాశం లేకుండా ధర్నాలు, ప్రదర్శనలు, వినతిపత్రాలు, నిరసనలు నిషేధిస్తున్నారు” అని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం బాధ్యత వహించాలి…
“ఇది వైస్ ఛాన్సలర్ కు సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదని ముఖ్యమంత్రి తప్పించుకోవడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తక్షణమే ఈ సర్క్యులర్ ను విరమించుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతమవుతుంది” అని వీరయ్య హెచ్చరించారు.
ఉస్మానియాలో ఆంక్షలు ఎత్తివేయాలి – సీపీఎం నాయకులు వీరయ్య డిమాండ్
