కాంగ్రెస్ తెచ్చిన కరువు – తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శ

సహనం వందే, సూర్యాపేట:
“నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్క నీరు తేలేకపోవడం సిగ్గుచేటు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేటలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం” అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి వెళ్లి చాపల కూర తిన్నారని ఆయన విమర్శించారు.
ఎన్టీఆర్ వల్లే తెలుగు వారికి గుర్తింపు…
“దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మదరాసీలు అని పిలిచేది. దాన్ని మార్చిన నాయకుడు ఎన్టీఆర్. ఒక పార్టీ పెట్టి భారతదేశంలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు. ఈ దేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందని, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్” అని కేటీఆర్ అన్నారు. “భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి” అని ఆయన అన్నారు. “100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, దేశాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీ ఒకవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు ఇంకోవైపు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టి నడపడం ఆషామాషీ విషయం కాదు” అని ఆయన అన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *