సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్పై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో విద్యా, వైద్య, వ్యవసాయం, గృహనిర్మాణ రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు, ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోకు, ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలకు ఎలాంటి పొంతన లేదని జాన్ వెస్లీ విమర్శించారు. ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపులు గత సంవత్సరం కంటే సగానికి తగ్గించారని, ఇది ఆచరణ సాధ్యం కాదని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, వాటికి తగినంత నిధులు కేటాయించలేదని ఆయన దుయ్యబట్టారు. మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి, కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది సరిపోదని జాన్ వెస్లీ అన్నారు. దాదాపు 30 లక్షల కుటుంబాలు ఇళ్లు లేనివారు ఉంటే, కేవలం 4.50 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి ప్రతిపాదన పెట్టారని, దీనివల్ల ఈ సంవత్సరం కూడా అమలు జరగని పరిస్థితి కనిపిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి, 40 లక్షల మందిలో కేవలం 5.50 లక్షల మందికే పరిమితం చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన నిధుల కేటాయింపుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్కు సంబంధం లేదని జాన్ వెస్లీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి, బడ్జెట్లో ఆ ఊసే లేదని ఆయన అన్నారు. కామారెడ్డిలో బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తామని చెప్పి, కేవలం రూ.11,400 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది మోసపూరితమని ఆయన మండిపడ్డారు. మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని ఆయన అన్నారు. విద్యారంగానికి గతంలో కంటే 2 శాతం తగ్గించారని, ఇది ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే చర్య అని జాన్ వెస్లీ విమర్శించారు. ఆర్టీసీ పరిరక్షణకు, ఉద్యోగుల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. అసంఘటిత రంగం, ఆశా, అంగన్వాడీల వేతనాల పెంపుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని ఆయన అన్నారు. పోడు భూములు సాగు చేసుకున్న వారికి పట్టాలిస్తామని చెప్పి, గిరిజన గూడెం, తండాల అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి, ఆ ఊసే లేదని ఆయన అన్నారు. రేషన్ కార్డుల ద్వారా పేదలకు 14 రకాల సరుకులు ఇచ్చేందుకు కేటాయింపులు లేవని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ను పునఃసమీక్షించాలని, కీలక రంగాలు, సంక్షేమ రంగాలకు కేటాయించిన పద్దులను అవసరానికి అనుగుణంగా పెంచాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడాలని ఆయన అన్నారు. లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఉద్యమాలు, పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర బడ్జెట్పై జాన్ వెస్లీ తీవ్ర విమర్శలు – నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్
