కేంద్రంలో దక్షిణాది కీలకపాత్ర పోషించాలి

సహనం వందే, హైదరాబాద్:
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉండేలా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు అందులో ముఖ్యంగా తెలంగాణ ఈ విధంగా నష్టపోతుందో చర్చించారు. ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చలు, ఆలోచనలు చేయాలని సమావేశానికి హాజరైన రాజకీయ పక్షాలను డిప్యూటీ సీఎం కోరారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్, బిజెపి నాయకులు హాజరు కాలేదు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఏర్పాటును వ్యతిరేకిస్తూ శాసనసభలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక సైంటిఫిక్ నిర్ణయం వచ్చేవరకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతానికి అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచాలని సిపిఐ శాసనసభ పక్ష నేత సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు ఈ అంశంపై పోరాటం చేస్తూ మరోవైపు సైంటిఫిక్ పరిష్కారం కోసం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు నిత్యం ఆలోచన చేయాలని కూనంనేని, వెస్లీలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *