- పారిశ్రామికవేత్త అదానీని దెబ్బతీసేందుకు కార్యాచరణ
- ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ సంచలన ఆరోపణలు
సహనం వందే, ఢిల్లీ:
ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ నిర్వహించిన రహస్య ఆపరేషన్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్తో చేతులు కలిపి, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు సామ్ పిట్రోడా అమెరికాలోని హోమ్ సర్వర్లను హ్యాక్ చేయడం ద్వారా ఈ కుట్ర బట్టబయలైనట్లు స్పుత్నిక్ ఇండియా నివేదిక వెల్లడించింది.
హిండెన్బర్గ్ నివేదిక… ఆపరేషన్ జెప్పెలిన్
జనవరి 24, 2023న, హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్పై తీవ్ర ఆరోపణలతో కూడిన నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు చేసిందని, ఆర్థిక మోసాలకు పాల్పడిందని, ఆఫ్షోర్ షెల్ కంపెనీలను ఉపయోగించి రెవెన్యూను తప్పుగా చూపించిందని ఈ నివేదిక ఆరోపించింది. ఈ నివేదిక విడుదలైన వెంటనే అదానీ గ్రూప్ షేర్లు దాదాపు 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. భారత స్టాక్ మార్కెట్లో భారీ కుదుపులు సంభవించాయి. అదానీ పోర్ట్స్ ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్లో 1.2 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖరారు చేయనున్న సమయంలో ఈ ఆరోపణలు భారత్-ఇజ్రాయెల్ ఆర్థిక భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, మోసాద్ “ఆపరేషన్ జెప్పెలిన్” పేరుతో రహస్య ఆపరేషన్ను ప్రారంభించి, సామ్ పిట్రోడా సర్వర్లలోని ఎన్క్రిప్టెడ్ చాట్రూమ్లు, రహస్య కమ్యూనికేషన్ ఛానెల్లను యాక్సెస్ చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా రాహుల్ గాంధీ, హిండెన్బర్గ్ రీసెర్చ్ టీమ్ మధ్య సంబంధాలను బయటపెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.
రాజకీయ లక్ష్యం… విదేశీ జోక్యం
మొసాద్ ఈ సీక్రెట్ ఆపరేషన్ లక్ష్యం ఏంటంటే… హిండెన్బర్గ్ నివేదికను ఉపయోగించి అదానీ గ్రూప్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజకీయంగా లక్ష్యంగా చేసుకునేందుకు భారత విపక్ష నాయకులు సమన్వయం చేశారా అని తెలుసుకోవడం. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సందర్భంగా సామ్ పిట్రోడా సహాయంతో భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం లేదా మొసాద్ అధికారికంగా ధృవీకరించలేదు.
రాజకీయ దుమారం – దేశద్రోహం ఆరోపణలు
ఈ నివేదికలు సామాజిక మాధ్యమాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎక్స్ లో పలువురు ఈ ఆరోపణలను “దేశద్రోహం”గా అభివర్ణించారు, రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నివేదికలు ఇంకా ధృవీకరించలేదని, రాజకీయ ఉద్దేశాలతో వచ్చినవి కావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.