తమిళంలో సంతకం ఎందుకు చేయరు?

  • ఆ భాష పై ప్రేమ ఉంటే తమిళంలోనే సంతకం చేయాలి
  • తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ప్రధాని మోడీ చురక
  • వైద్య తరగతులను కూడా తమిళంలోనే బోధించాలని సూచన

సహనం వందే, చెన్నై:
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తమిళ భాషపై ప్రేమ ఉన్నట్లయితే, తమిళనాడు నాయకులు తమ సంతకాలను తమిళ భాషలోనే చేయాలని పీఎం మోదీ సూచించారు. “తమిళనాడు నాయకుల నుంచి నాకు వచ్చే లేఖలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో ఎవరూ తమ సంతకాలను తమిళ భాషలో చేయడం లేదు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో భాషా వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో హిందీ భాషను వ్యతిరేకిస్తూ, తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఈ విమర్శలు చేయడం గమనార్హం. తమిళనాడులో ఆదివారం పర్యటించిన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

తమిళంలో వైద్య కోర్సు ప్రారంభించాలని సవాల్…
తమిళ భాషకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పే స్టాలిన్ ప్రభుత్వానికి పీఎం మోదీ సవాల్ విసిరారు. తమిళనాడు ప్రభుత్వం తమిళ భాషలో వైద్య కోర్సులను ప్రారంభించాలని ఆయన సూచించారు. “తమిళ భాషపై అంత ప్రేమ ఉంటే, మీరు తమిళంలో వైద్య విద్యను ఎందుకు ప్రారంభించడం లేదు? దీనిని సాధించే దిశగా చర్యలు తీసుకోండి” అని మోదీ అన్నారు. ఈ సవాల్‌తో తమిళనాడు ప్రభుత్వం ఒత్తిడిలో పడినట్లు కనిపిస్తోంది. తమిళ భాషలో విద్యను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని మోదీ సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనను అమలు చేయడం స్టాలిన్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిధుల కేటాయింపుపై స్టాలిన్ ఆరోపణలను ఖండించిన మోదీ…
తమిళనాడుకు కేంద్రం నుంచి నిధులు సరిగా కేటాయించడం లేదన్న స్టాలిన్ ఆరోపణలను పీఎం మోదీ ఖండించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తమిళనాడుకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. “తమిళనాడు అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది. గతంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ నిధులు కేటాయించింది. ఈ విషయంలో స్టాలిన్ చేస్తున్న ఆరోపణలు సరికాద”ని మోదీ అన్నారు. కేంద్రం నుంచి తమిళనాడుకు వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

భాషా వివాదం… రాజకీయ లబ్ధి కోసమేనా?
తమిళనాడులో భాషా వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. హిందీ భాషను రాష్ట్రంలో విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీశాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం తమిళ భాషను పరిరక్షించడంలో నిజంగా కృషి చేస్తుందా లేక రాజకీయ లబ్ధి కోసం ఈ వివాదాన్ని రెచ్చగొడుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భాషా వివాదానికి ముగింపు ఎప్పుడు?
తమిళనాడులో భాషా వివాదం రాజకీయ, సామాజిక సమస్యగా మారింది. ఈ వివాదం రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తోందని, దీనికి త్వరగా పరిష్కారం చూడాలని సామాజిక విశ్లేషకులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడుతున్నారు. భాషా వివాదం కారణంగా రాష్ట్ర అభివృద్ధి ప్రభావితం కాకుండా చూడాలని, అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *